శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2022 (14:19 IST)

పవన్ కళ్యాణ్‌కు ఏపీ పోలీసుల నోటీసు - వైజాగ్‌ను వీడాలంటూ అల్టిమేటం

pawan kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వైజాగ్ పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. సాయంత్రం 4 గంటల లోపు విశాఖపట్టణాన్ని వీడాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నోటీసులను తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించారు. దీంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేసమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
 
జనవాణి పేరుతో పవన్ కళ్యాణ్ విశాఖలో మూడు రోజుల పర్యటన తలపెట్టిన విషయం తెల్సిందే. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో విశాఖ పోలీసులు పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన కీలక నేతలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలని సదరు నోటీసుల్లో పవన్‌తో పాటు జనసేన నేతలకు పోలీసులు ఆదేశాలు జారీచేశారు. 
 
ఈ నోటీసులను తీసుకునే విషయంలో జనసేన నేతలు, విశాఖ పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నోటీసులు తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించడంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నామని ఆయనకు నచ్చజెప్పారు. ఈ నోటీసులపై పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.