శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

'కల్కి కోట'లో ముగిసిన ఐటీ దాడులు... సీడీలు - హార్డ్ డిస్క్‌లు స్వాధీనం

మహా విష్ణువు పదో అవతారంగా చెప్పుకుంటూ రాజభోగాలు అనుభవించిన కల్కి భగవాన్ ఆశ్రమంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాలు శనివారం రాత్రితో ముగిశాయి. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు, వజ్ర ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పలు సీడీలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. 
 
కల్కి ట్రస్టుకు దేశ, విదేశాల నుంచి వస్తున్న విరాళాలను ఇతర వ్యాపారాలకు మళ్లిస్తున్నారనే అభియోగాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఉన్న కల్కి భగవాన్ ఆశ్రమంలో గత నాలుగు రోజులు పాటు ఐటీ సోదాలు జరిగాయి. వరదయ్యపాళెం మండల పరిధిలోని ఏకం ఆధ్యాత్మిక కేంద్రం, ఉబ్బలమడుగు సమీపంలోని ఆనందలోక క్యాంపస్‌లలో ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. 
 
ఏకం ఆశ్రమంలో అధిక మొత్తంలో నగదు, బంగారం, భూములకు సంబంధించిన పత్రాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అధికారులు ఆశ్రమ నిర్వాహకులు, ఉద్యోగుల నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులను కూడా సీజ్‌ చేశారు. 
 
ఆశ్రమం నుంచి చెన్నైకి బయలుదేరిన అధికారులను మాట్లాడించేందుకు స్థానిక విలేకరులు ప్రయత్నించగా.. 'మేం పూర్తి వివరాలను చెన్నైలోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటిస్తాం' అని చెబుతూ.. వెళ్లిపోయారు. ఆశ్రమంలోని వన్‌హ్యూమానిటీ కేర్‌ సంస్థ ఉపాధ్యక్షుడు లోకేశ్‌జీ కూడా ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.