1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (10:20 IST)

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు, ఇంకొద్ది గంట‌ల్లోనే: ఎంపీ రఘురామ ఉవాచ‌

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దు అవుతుంది... అదీ, ఇంకొద్ది గంటల్లోనే...అంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు  షాకింగ్ ట్వీట్ చేశారు. సొంత పార్టీపైన‌, సీఎం జగన్‌పైనా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు త‌న విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు.

రెబల్ అయిన త‌న‌పై అనర్హత వేటు తప్పదని, ఆ వెంటనే విదేశాలకు పారిపోయేందుకు రెడీ అవుతున్నాన‌ని వైసీపీ పార్టమెంటరీ నేత విజయసాయిరెడ్డి చెపుతున్నార‌ని... ఆ పారిపోయేది తాను కాదని, సాయిరెడ్డే అని, ఎంపీకి దేహశుద్ది కూడా జరిగిందని రఘురామ అనూహ్య కౌంటరిచ్చారు.
 
ఏపీ వరదాయిని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన అంచనాలు (రూ.47వేల కోట్ల)కు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని, విజయసాయిరెడ్డి పోరాటం వల్లే అది జరిగిందని జగన్ మీడియా సాక్షి పత్రికలో రాశారు. సరిగ్గా ఇదే వార్త 47 వేల కోట్లకు జల శక్తి ఆమోదం తెలిపిందని 2020, సెప్టెంబర్ లోనూ రాశారు.

అంటే, ఎప్పుడో లభించిన ఆమోదానికి మళ్లీ వీళ్లు ఆమోదం తెచ్చుకున్నారన్నమాట. ఆమోదం తెలిపినంత మాత్రాన డబ్బులు ఇచ్చేది జల శక్తి శాఖ కాదు, ఆర్థిక శాఖ ఇప్పటికే కొర్రీలు పెట్టింది. ఎవర్ని మోసం చేయడానికి ఇలా పోలవరంపై డ్రామాలాడుతున్నారు? మా వాళ్ల అసలు టార్గెట్, నాపై అర్హతవేటు వేయించడమే తప్ప పోలవరం, ఏపీ ప్రయోజనాలు వైసీపీకి ప్రయారిటీ కావ‌ని ర‌ఘ‌రామ విమ‌ర్శించారు. 
 
ఏపీలో రివర్స్ టెండరింగ్ మాదిరిగా రివర్స్ కేసుల ఒరవడి నడుస్తోంది. ఓ ప్రముఖుడి ఇంటి దగ్గర రోడ్డుపై గుంతలు పడితే, చిన్న గుంగలు పూడ్చడానికి ఏకంగా జాతీయ రహదారిని అడుగుల లోతులో తొవ్వి, దాన్ని పూడ్చడానికి అవసరమైన కంకర కోసం మైనింగ్ చేస్తున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఆకలేస్తే దొంగతనం చేయడం తప్పా? అని జులాయి సినిమాలో బ్రహ్మానందం అడిగినట్లుగా ఉందీ వ్యవహారం. అక్రమ మైనింగ్ ను ప్రశ్నించినందుకు టీడీపీ నేత దేవినేని ఉమపై రివర్స్ కేసులు పెట్టారు. దెబ్బతిన్నవాడిపైనే కేసులు.. సంబంధం లేని విషయాలూ చొప్పించి ఏకంగా 14 సెక్షన్ల కింద కేసులు పెట్టార‌ని ఆరోపించారు. 
 
ఇక జగన్ బెయిల్ రద్దు కేసు విషయానికొస్తే... సీబీఐ లాయర్లకు జ్వరం తగ్గింద‌ని, శుక్రవారం వరకూ వాళ్లు ఆరోగ్యంగా ఉండి, కోర్టుకు వాదనలు సమర్పిస్తే జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయం వెలువడే అవకాశముంద‌ని ర‌ఘ‌రామ జోస్యం చెప్పారు. అసలు ఇన్ని వాయిదాలు కోరడం, లిఖిత పూర్వక కౌంటర్ దాఖలుకు ఇంత సమయం తీసుకోవడంపై సుప్రీంకోర్టు జడ్జిలు ఆసక్తికర కామెంట్లు చేశార‌న్నారు.

ప్రపంచంలో ఎక్కడా మనలా కోర్టు సమయాన్ని వృథా చేయబోరని, అమెరికాలోనైతే మూడు పేజీలకు మించని కౌంటర్, 30 నిమిషాల్లోపే వాదనలు పూర్తి చేయాలనే రూల్ ఉందని సుప్రీంజడ్జిలు వ్యాఖ్యానించార‌ని, ఇదే స్ఫూర్తితో సీబీఐ లాయర్లు కూడా త్వరగా పని పూర్తి చేయాల‌న్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టులో వేసే కౌంటర్‌ను బట్టి ఏ1 జగన్, ఏ2 సాయిరెడ్డి సంగతి తేలుతుంద‌ని పేర్కొన్నారు. 
 
నేనేదో విదేశాలకు పారిపోడానికి రెడీ అవుతున్నట్లు సాయిరెడ్డి కారు కూతలు కూస్తున్నాడు. పోయేది నేను కాదు, జగన్ బెయిల్ రద్దయిన వెంటనే తానే పారిపోడానికి సాయిరెడ్డి పాస్ పోర్టుకు అప్లై చేసుకున్నాడు. కానీ అది రిజెక్ట్ అయిందని తెలిసింది. ఆ విషయం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. నిజానికి.. విజ‌య సాయిరెడ్డికి దేశహుద్ది జరిగినట్లు తెలిసింది. సాయిరెడ్డిని కొట్టింది ఎవరో ఆ దేవుడికే తెలియాలి. అతనొక క్రిమినల్. ఎప్పుడూ తప్పుడు సలహాలే ఇస్తుంటాడు, గతంలో నాక్కూడా అలాంటి సలహాలే ఇచ్చాడు అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.