1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 18 మే 2024 (14:22 IST)

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

Jaganmohan Reddy
కర్టెసి-ట్విట్టర్
ఫలితాలతో సంబంధం లేకుండా వైసిపి తనదైన శైలిలో అంచనాకు వచ్చేసింది. విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగబోతోందనీ, జూన్ 4 నుంచి సంబరాలకి సిద్ధమవ్వండి అంటూ పిలుపునిచ్చింది. తన అధికారిక వైసిపి పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మరి జనం తీర్పు ఎలా వుందో తెలియదు కానీ అధికార పార్టీ మాత్రం అధికారికంగా ఈ ప్రకటన చేసేసింది.
 
జగన్ మరోసారి సీఎం కావాలని కసితో ఓట్లేసారు
YS Jagan Waveలో ప్రతిపక్షాలు కొట్టుకుపోబోతున్నాయంట. వైనాట్ 175 అనే మాటను వైసిపి నాయకులు కాస్త సవరించుకుని Now 120 అని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారంటూ రెట్టించిని ఉత్సాహంతో చెబుతున్నారు. హైదరాబాద్, కర్నాటక, తమిళనాడు, అమెరికా.. ఇలా పొరగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారంతా కసితో జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని ఓట్లు వేసారనీ, అవన్నీ సానుకూల ఓట్లు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెపుతున్నారు.
 
సహజంగా ఓటింగ్ శాతం 80% దాటింది అంటే అది పాలకపార్టీ కొంపముంచుతుంది. కానీ ఇక్కడ జరిగింది వేరు అంటున్నారు సజ్జల. ఇంత భారీగా ఓట్లు పోలవడం అంతా ప్రభుత్వానికి సానుకూల ఓట్లనీ, జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని ఏపీ ప్రజలందరూ కట్టగట్టుకుని ఓట్లు వేసారని విశ్లేషిస్తున్నారు. 2019లో ఆనాడు బాబు సర్కారుపై వ్యతిరేకత కారణంగా 79.64 శాతం ఓటింగ్ నమోదైందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు 80 శాతం మాత్రం కేవలం జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకే జనం ఓట్లు వేసారని చెబుతున్నారు. మరి ఆయన విశ్లేషణలో నిజం ఎంత వున్నదో, ఏపీ ప్రజలు నిజంగా ఓట్లు ఏ పార్టీకి వేసారో తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.