శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (11:37 IST)

ప్రజాస్వామ్యానికి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారు: యనమల రామకృష్ణుడు

తిరుపతి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని నిర్బంధించడం అప్రజాస్వామికం. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని నిర్బంధించడం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనం.

చంద్రబాబు పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి ఎంతలా భయపడుతున్నారనడానికి చిత్తూరు జిల్లా పర్యటనలో అడ్డుకోవడమే నిదర్శనం.  ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉంది. ఇష్టాను సారంగా ఎక్కడబడితే అక్కడ నిర్భందించడం పౌర స్వేచ్ఛను హరించడమే.

నాడు జగన్ రెడ్డి పర్యటనలను మేము అడ్డుకుంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉండేవారా? మీకు పాలన చేతనైతే  ప్రజల దగ్గరకెళ్లే ప్రతిపక్ష నాయకులను ఎందుకు అడ్డుకుంటున్నారు.? ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? 

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. వ్యవస్థలను సర్వ నాశనం చేస్తున్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం దుర్మార్గపు చర్య. 

జగన్ రెడ్డి చర్యలు హిట్లర్ పాలనను తలపిస్తున్నాయి. తిరుపతిలో 43వ డివిజన్ టీడీపీ అభ్యర్థి షాపును వైసీపీ నేతలు కూల్చి వేసి కక్షపూరితంగా వ్యవహరించినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతూ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ భయోత్పాదానికి గురిచేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా  పోలీసులు పట్టించుకోవడంలేదు.

ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్న  టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులపాలు చేయడం దారుణం. పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారు.

చంద్రబాబు పర్యటనకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల కష్టాలపై టీడీపీ  పోరాటం ఆగదు.  చర్యకు ప్రతి చర్య తప్పదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి.