1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:05 IST)

కోర్టు ధిక్కరణ కేసులో సబ్ కలెక్టరుకు ఆర్నెల్ల జైలుశిక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోర్టు తీర్పును యధేచ్చగా ధిక్కరిస్తున్నారు. అలాంటి వారికి ధర్మాసనం జైలుశిక్షలను విధిస్తుంది. ఇటీవల ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత వారు ప్రాధేయపడటంతో వారు యేడాదిపాటు సంఘ సేవ చేయాలంటూ ఆదేశించింది. 
 
తాజాగా ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. దీంతో వారికి ఒక ఆర్నెల్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వీరిలో రాజంపేట సబ్‌కలెక్టర్ ఖేతన్ గర్గ్, ఏపీఎండీసీ సీపీఓ సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. ఆరు నెలల జైలుతో పాటు రూ.2 వేల అపరాధం కూడా విధించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా ఓబులావారి పల్లె మండలం మంగంపేటలో 2003లో జరిగిన మైనింగ్ కారణంగా గ్రామానికి చెందిన నరసమ్మ తన ఇంటిని కోల్పోయింది. పరిహారం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించగా ఆమెకు చుక్కెదురైంది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. 
 
ఈ కేసును విచారించిన హైకోర్టు ఆమెకు పరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశించినప్పటికీ ఆమెకు మాత్రం పరిహారం అందలేదు.దీంతో ఆమె మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కోర్టు ధిక్కరణ చర్యల కింద ఇద్దరు అధికారులకు ఆర్నెల్లపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.