శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (15:21 IST)

తిరుపతి సీటిస్తే మా తడాఖా చూపిస్తాం.. పవన్ : మోకాలొడ్డుతున్న బీజేపీ!

తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇటీవల కరోనా వైరస్ సోకి మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం వైకాపా తరపున అభ్యర్థిని కూడా ఆ పార్టీ ప్రకటించింది. అలాగే, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా తమతమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో నిమగ్నమైవున్నారు.
 
ఈ నేపథ్యంలోఉప ఎన్నిక జరిగే తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానంతో చర్చించేందుకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలసి పవన్‌ కల్యాణ్‌ సోమవారం ఢిల్లీ వెళ్లారు. 
 
తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమయ్యామని, అందువల్ల తిరుపతిలో తమకు అవకాశం ఇవ్వాలని ఆయన బీజేపీ పెద్దలను కోరనున్నారు. 
 
గతంలో తిరుపతిలో ప్రజారాజ్యం తరపున చిరంజీవి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించిన వైనాన్ని, అక్కడ ఓ బలమైన సామాజికవర్గం ఆది నుంచి జనసేనకు అండగా ఉంటున్న విషయాన్ని పవన్‌ బీజేపీ అధిష్ఠానానికి వివరించనున్నారని చెబుతున్నారు. 
 
అయితే తిరుపతిని తమ బలమైన స్థావరంగా భావిస్తున్న బీజేపీ ఆ స్థానాన్ని వదులుకుంటుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. పైగా, తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి విజయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది. అందుకే ఈ స్థానాని వదిలిపెట్టేందుకు ఏపీ బీజేపీ నేతలు ఏమాత్రం సముఖంగా లేరు.