1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

జనసేన ఆవిర్భావ వేడుకలు... గౌరవంలేని చోట ఉండను : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అణగారిన వర్గాలు, బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాక్షించారు. తెలంగాణ నుంచే బలంగా ముందుకెళతామని పవన్‌ స్పష్టం చేశారు. 
 
పాలకులు చేస్తున్న తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే పాలకులను, ప్రజలను వేరు చేయాలని కోరుకుంటున్నానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కులం ప్రాతిపదికన రాజకీయాలు జరగడం దురదృష్టకరమన్నారు. సమతుల్యతతో కూడిన బహుజన విధానమే జనసేన ఆకాంక్షఅని పవన్‌ వివరించారు.  
 
రాష్ట్ర విభజన సమయంలో భాజపా మద్దతు తెలిపింది. ఏపీకి  ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు ఇచ్చినందుకే భాజపాతో పొత్తు పెట్టుకున్నాం. భూ సంస్కరణలు తెచ్చి పీవీ సీఎం స్థానం పోగొట్టుకున్నారు. పీవీ చితి కాలకుండా అగౌరవపరిచారు. విభజన అన్యాయంతో ఏపీ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోంది.
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జన సైనికులు నిలబడిన విధానం హర్షణీయం. తెలంగాణ నాయకత్వం జనసేనను అంగీకరించలేకపోతోంది. భాజపా నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. కేంద్రంతో సత్సంబధాలు ఉన్నాయి. తెలంగాణలో మంచి సంబంధం లేదని జనసేన నేతలు బాధపడ్డారు. 
 
తమ మనోభావాలు దెబ్బతీయొద్దని తెలంగాణ జనసైనికులు కోరారు. గౌరవం ఇవ్వకపోవడంపై జనసేన నేతలు బాధపడుతున్నారు. పీవీ కుమార్తెకు మద్దతు తెలుపుదామని జనసైనికులు స్పష్టం చేశారు. పీవీ కుమార్తెకు మద్దతు ఇవ్వాలన్న నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. గౌరవం లేనిచోట స్నేహం చేయాలని కోరుకోవట్లేదు అని పవన్ చెప్పుకొచ్చారు.