శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జులై 2019 (19:17 IST)

సీఎం జగన్‌‌తో జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ భేటీ

చెన్నైలో ఉన్న జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్‌లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను ఉచియామ ఆహ్వానించారు.

అవినీతిలేని, పారదర్శక పాలనకోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని జపాన్‌కాన్సులేట్‌ జనరల్‌కు సీఎం వివరించారు. పరస్పన ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురి భాగస్వామ్యాలు ఉండాలని ఆకాక్షించారు. కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకూ కూడా పూర్తిస్థాయిలో సహాయకారిగా ఉంటామని సీఎం వివరించారు.

ఏదశలోనూ లంచాలకు, రెడ్‌టేపిజానికి తావులేని విధంగా తోడుగా ఉంటామని చెప్పారు. పరిశ్రమలు వద్ధిచెందాలంటే శాంతి, సహద్భావ వాతావరణం కూడా అవసరమని, దీంట్లో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం నైపుణ్యాభివద్ధి ఉన్న మానవవనరులకోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ ముఖ్యమంత్రి వివరించారు. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామని, ఆదిశగా పెట్టుబడుల పెట్టే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమలకోసం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామనికూడా ప్రభుత్వం తెలిపింది. కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తిచేసింది. అత్యాధునిక వసతులున్న పోర్టులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉన్నందున జపాన్‌ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలంగా ఉంటున్న విషయాన్నీ కూడా ప్రభుత్వం వారికి వెల్లడించింది.

రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, ఆహార సంబంధిత పరిశ్రమలు, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్‌ వ్యవసాయశాఖ మిజుహొ ఇన్ఫర్మేషన్‌ మరియు రీసెర్చ్‌ ఇనిస్ట్యూట్‌ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోంది.