శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (08:41 IST)

ఉత్తరాఖండ్‌లో కుంగిబోతున్న ఓ గ్రామం.. అప్రమత్తమైన కేంద్రం

joshmutt village
హిమాలయా పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లో ఓ గ్రామం కుంగిపోతోంది. ఆ గ్రామం పేరు జోషిమఠ్. ఇప్పటికే దాదాపు 600కు పై చిలుగు గృహాలు భూమిలోకి కుంగిపోవడం మొదలుపెట్టాయి. మరికొన్ని ఇళ్ళకు బీటలు వచ్చాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ప్రధానమంత్రి కార్యాలయం జోషిమఠ్ గ్రామానికి ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపింది. పైగా, బీటలు వారిన, కుంగిన గృహాలను తక్షణం కూల్చివేయాలని ఆదేశించింది.
 
మరోవైపు, ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షత ఈ సమావేశం జరిగింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు, డీజీపీ అశోక్ కుమార్‌, ఇతర ఉన్నాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జోషిమఠ్ గ్రామం వేగంగా భూమిలోకి కుంగిపోతోంది. ఇళ్లకు పగుళ్లు వస్తుండటంపై చర్చించారు. 
 
జోషిమఠ్ గ్రామాన్ని పరిశీలించిన నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నరు. ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని సీఎస్ ఎస్ఎస్ సంధు చెప్పారు. జోషిమఠ్ గ్రామం నుంచి ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నామని చెప్పారు. భూమి కుంగిపోవడానికి కారణాలు సత్వరమే తెలుసుకోవాల్సి ఉందన్నారు. కేంద్రం నిపుణులతో మాట్లాడిందని, సోమవారం కూడా నిపుణుల బృందం జోషిమఠ్‌ గ్రామాన్నిసందర్శిస్తుందని ఆయన తెలిపారు.