శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (17:56 IST)

జగన్‌.. తుగ్లక్‌లా చేయొద్దు: కేశినేని : రాజధానిపై తలో మాట: గల్లా

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మార్పు ప్రచారంపై విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని తనదైనశైలిలో స్పందించారు. రాజధానిని పదేపదే మార్చిన మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని, ఇప్పుడు మళ్లీ అదేపని చేసి ముఖ్యమంత్రి జగన్‌ మరో తుగ్లక్‌లా చరిత్రలోకి ఎక్కకూడదని భవగంతుణ్ని కోరుకుంటున్నానంటూ ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 
 
మరోవైపు తాము ఏంచేసినా.. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే చేస్తున్నామన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారంటూ ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధానిని అడ్డు పెట్టుకోవడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు. 
 
రాజధానిపై తలో మాట: గల్లా 
కృష్ణానది వరదపై ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఫలితంగా వరద ఉద్ధృతికి 6 వేల ఎకరాలు నీట మునిగాయని తెదేపా ఎంపీ గల్లాజయదేవ్‌ అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు కేశినేనినాని, దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. పంటనష్టపోయి 10 వేల మంది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని అన్నారు. అమరావతి రాజధానిపై మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను భాజపా నేతలు తప్పుపట్టారని ఆయన గుర్తుచేశారు.