గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (15:03 IST)

ఉన్నావ్ రేప్ కేసు : ఎమ్మెల్యే కుల్దీప్‌కు జీవితఖైదు

ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ తీజ్‌హజారీ కోర్టు జీవితకారాగార శిక్షను విధించింది. అలాగే, బాధితురాలికి రూ.25 లక్షలు చెల్లించాలంటూ జరిమానా వేసింది. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు ఉన్న ముప్పును సీబీఐ అంచనా వేసి, సురక్షిత నివాసం కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. 
 
కాగా, గత 2017 జూన్ 4వ తేదీన ఓ యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్లు సెంగార్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన తీజ్‌హాజారీ కోర్టు కుల్దీప్‌ను ఇటీవల దోషిగా ప్రకటించింది. అయితే, శిక్షలను మాత్రం శుక్రవారం ఖరారు చేసింది. తాజాగా శుక్రవారంనాడు తీర్పును వెలువరుస్తూ యావజ్జీవ శిక్షను ప్రకటించింది. దీంతో ఆయన జీవితాతం జైలులోనే ఉండాల్సి వస్తుంది.
 
కాగా, 2017 నుంచి అత్యాచారం కేసుపై పోరాటం చేస్తున్నా తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితురాలు సీఎం యోగి నివాసం ఎదుట కొద్దికాలం క్రితం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఈ కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. కుల్దీప్‌పై కేసు పెట్టారనే అకారణంగా ఆయన సోదరుడు తన తండ్రిని చెట్టుకు కట్టేసి బహిరంగంగా కొట్టారని కూడా ఆమె చెప్పింది. యోగి చొరవతో దీనిపై కేసు నమోదైంది. 
 
ఈ కేసులో కుల్దీప్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని, మహిళల అపహరణ, అత్యాచారం, నేరపూరిత బెదిరింపులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం సీబీఐ అధికారులు కేసును పారదర్శకంగా విచారణ చేయడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు సీబీఐ నుంచి కేసును తీస్ హజారీ కోర్టుకు బదిలీ చేసింది. కేసుపై విచారణ చేపట్టిన తీస్ హాజారీ న్యాయ‌స్థానం కుల్దీప్‌ను దోషిగా ప్రకటించింది. తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది.