శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (07:58 IST)

అమరావతిలో భూముల తాకట్టు?: జగన్ ప్రభుత్వ నిర్ణయం!

అమరావతిలో రాజధానికోసం సమీకరించిన భూములను తాకట్టు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను ప్రధానంగా అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులకోసం వినియోగించాలని భావిస్తోంది. దీనికోసం దీనికోసం ఇప్పటికే బ్యాంకుల కన్సార్టియంను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఎంఆర్‌డిఎ) సంప్రదించినట్లు తెలిసింది.

తాకట్టు కోసం ఎకరం భూమి విలువ రూ.2.50 కోట్లుగా నిర్థారించారు. అయితే కరకట్ట విస్తరణ, జాతీయ రహదారి నిర్మాణం అనంతరం కొంత ధర పెరుగుతుందని, అవసరమయితే అప్పుడు మరోసారి భూముల ధరలను సవరించొచ్చనే భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల సిఎస్‌ అధ్యక్షతన నియమించిన కమిటీ కూడా వీటికి సంబంధించిన అంశాలపైనా సమీక్ష నిర్వహించింది. దీనిలో పేదల కోసం కట్టిన ఇళ్లను రాజధాని పరిధిలో పేదలకు ఇవ్వాలా, లేక ప్రభుత్వం సూచించిన వారికి ఇవ్వాలా అనే అంశంతోపాటు నిధుల సమీకరణకు అవసరమైతే వాటిని కూడా బ్యాంకుల కన్సార్టియంలో తాకట్టు పెట్టే అంశాన్ని పరిశీలించారు.

రాజధానిలో లేఅవుట్ల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం కోసం సుమారు రూ.14 వేల కోట్లు అవసరం అవుతాయని ఎఎంఆర్‌డిఏ లెక్కగట్టింది. భూముల తాకట్టుకు సంబంధించి ఇప్పటికే యూనియన్‌ బ్యాంకు కన్సార్టియంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.

ప్రస్తుతం రోడ్లు, కనెక్టివిటీకి కొంత సొంత నిధులు వెచ్చించి భూమి విలువ పెరిగిన తరువాత వాటిని ఆర్థికవనరుగా వినియోగించుకునే ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల సిఎం వద్ద జరిగిన సమీక్షలోనూ ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.