ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (10:50 IST)

అమరావతిలో జోరుగా అభివృద్ధి పనులు.. మరోమారు ల్యాండ్ పూలింగ్!!

amaravati
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గత ఐదేళ్లుగా శ్మశాన్ని తలపించిన ఈ ప్రాంతం ఇపుడు కళకళలాడుతుంది. ముగిసిన ఎన్నికల్లో అధికార వైకాపాను నవ్యాంధ్ర ప్రజలు చిత్తుగా ఓడించి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిసారించారు. ఆయన బాధ్యతతలు చేపట్టగానే అమరావతి అభివృద్ధిపై దృష్టించారు. ఆ మరుసటి రోజు నుంచే అమరావతి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. దీనికితోడు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో రాజధాని రైతుల్లో ఉత్సాహం పెల్లుబికింది. అదేసమయంలో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చేందుకు ముందుకువస్తున్నారు. ఫలితంగా పెనుమాకలో రాజధాని, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి 2 రోజుల్లో 2.65 ఎకరాల సేకరించారు. 
 
అంతకుమునుపు, రాజధాని భూ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ లాండ్ పూలింగ్ పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భూములిచ్చేందుకు ముందుకొస్తున్న రైతుల నుంచి తీసుకోవాలని డిప్యుటీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం లాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. భూసేకరణకు సంబంధించిన ప్రకటనను కూడా ఉపసంహరించుకుంది. 
 
ఇక రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాజధాని కోసం భూసేకరణ చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అప్పట్లో 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరించింది. మరో 4 వేల ఎకరాలను సేకరించాల్సి ఉండగా రైతులు తమ భూములిచ్చేందుకు నిరాకరించడంతో పూలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు, రాజధానిలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో ప్రభుత్వ సిబ్బంది కొరత తలెత్తింది. దీంతో, ఇతర శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై రాజధానికి తీసుకొచ్చేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఓ ప్రకటనలో దరఖాస్తులను ఆహ్వానించారు.