1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 20 ఆగస్టు 2020 (16:18 IST)

కరోనా పాజిటివ్ రోగిపై చిరుత దాడి, చిరుతకు కూడా వైరస్ సోకిందా?

తిరుపతిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు దాడికి దిగాయి. జూ పార్కు రోడ్డు ఎదురుగా మోటారు సైకిల్ పైన వెళుతున్న ఒక యువకుడిపై ఉన్నట్లుండి దాడి చేసింది చిరుత. ఈ దాడిలో యువకుడి కాళ్ళకు గాయాలయ్యాయి. తాను వెళుతున్న మోటారు సైకిల్‌ను అతి వేగంగా నడపడంతో చిరుత నుంచి తనను తాను కాపాడుకున్నాడు యువకుడు.
 
అయితే ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో యువకుడు కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను తీసుకొనేందుకు వెళుతుండగా ఘటన జరిగింది. యువకుడు తల్లిదండ్రులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. అనుమానంతో రెండురోజుల క్రితమే తను పరీక్షలు చేయించుకున్నాడు.
 
రిపోర్టులు రాకపోవడంతో ఆ యువకుడు మోటారు సైకిల్ పైన జూపార్కు రోడ్డులో ఆసుపత్రికి వెళుతుండగా ఘటన జరిగింది. చిరుత యువకుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అయితే చిరుత దాడి చేసిన వ్యక్తికి పాజిటివ్ ఉంటే చిరుతకు కరోనా సోకే అవకాశం ఉందన్న అనుమానాన్ని అటవీశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
 
కానీ జంతువులకు కరోనా సోకే అవకాశం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ దట్టమైన అటవీ ప్రాంతంలోకి చిరుతను తరలించే ప్రయత్నం అటవీశాఖాధికారులు చేస్తున్నారు.