శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 21 జనవరి 2021 (21:50 IST)

ఈసారి సీటు బిజెపికి ఇచ్చేద్దాం, సహకరించండి: జన సేనాని

రాజకీయ పొత్తుతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక అడుగు ఎప్పుడూ వెనకే వేస్తున్నారు. తెలంగాణా నగరపాలక ఎన్నికల దగ్గర నుంచి ప్రస్తుత తిరుపతి ఉపఎన్నిక వరకు పవన్ కళ్యాణ్ ఒకేరకమైన పంథాను అనుసరిస్తున్నారట. అందులోను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలోను ఎప్పుడూ భాజపాకు సహకరిస్తున్నారు పవన్ కళ్యాణ్.
 
దుబ్బాక, హైదరాబాద్ నగర పాలిక ఎన్నికల తరువాత తిరుపతి ఉప ఎన్నిక మీదే అందరి దృష్టి పడింది. తిరుపతి ఉప ఎన్నికను ఒక సవాల్‌గా తీసుకున్న రాజకీయ పార్టీలు ఎలాగైనా గెలుపొందాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా టిడిపి ప్రతిపక్ష హోదాలో ఉంటే ఈసారి ఎలాగైనా ఎంపి సీటును కైవసం చేసుకోవాలని ఒక వ్యూహంతో ముందుకు వెళుతున్నారు.
 
అయితే ముందు నుంచి బిజెపి దూకుడు పెంచింది. జనసేనతో పొత్తు ఉన్నా సరే బిజెపి నేతలు మాత్రం తిరుపతి ఉప ఎన్నికనే టార్గెట్ చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా బిజెపి అభ్యర్థినే నిలబెట్టాలన్న నిర్ణయంలో ఉన్నారు ఆ పార్టీ ముఖ్య నేతలు.
 
ఈ నేపథ్యంలో తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సమావేశమైంది. మొత్తం 15మంది సభ్యులు ఈ సమావేశంలో భేటీ అయ్యారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలన్న విషయంపై సుధీర్ఘంగా చర్చ కొనసాగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కుండబద్దలు కొట్టినట్లు బిజెపి నుంచే అభ్యర్థిని నిలబెడదామని జనసైనికులందరికీ చెప్పి ఆ అభ్యర్థికి సహకరించాలని విజ్ఙప్తి చేశారట. 
 
మొదట్లో కమిటీలోని సభ్యులందరూ పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా ఆ తరువాత అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశారట ఆ పార్టీ ప్రధాన నేత నాదెండ్ల మనోహర్. రేపు అధికారికంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.