1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (09:32 IST)

'అక్ష్యరాస్యత'లో తెలుగు రాష్ట్రాల స్థానమెక్కడ?

జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో అక్ష్యరాస్యతపై ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఎప్పటిలాగే అక్ష్యరాస్యతలో కేరళ రాష్ట్ర అదరగొట్టింది. ఈ రాష్ట్రం 96.2 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 88.7 శాతం అక్షరాస్యతో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్‌ (87.6శాతం), హిమాచల్‌ప్రదేశ్‌(86.6శాతం), అసోం (85.9శాతం) ఉన్నాయి.
 
ఇకపోతే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం తమతమ స్థానాలను మెరుగుపరుచుకోకపోగా, మరింతగా దిగజారిపోయాయి. ఈ జాతీయ నమూనా సర్వే ప్రకారం 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగు స్థానంలో నిలవగా.. తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. 
 
'హౌస్‌హోల్డ్‌ సోషల్‌ కన్సంప్షన్‌ : ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా' అనే అంశంపై నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ 'జాతీయ నమూనా సర్వే' పేరిట నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత రేటుపై ఆ సర్వే ఆధారంగా ఒక నివేదికను సమర్పించింది. దాని ప్రకారం.. దేశంలో అక్షరాస్యత రేటు 77.7 శాతంగాను, గ్రామీణ ప్రాంతాల్లో 73.5 శాతంగా ఉండగా.. పట్టణప్రాంతాల్లో 87.7 శాతంగా నమోదైంది. 
 
స్త్రీ, పురుషుల్లో అక్షరాస్యత విషయానికి వస్తే.. పురుషుల్లో అది 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో 70.3 శాతం. ఇది జాతీయ సగటు. రాష్ట్రాలవారీగా చూసుకున్నా.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కేరళలో అత్యధికంగా పురుషుల అక్షరాస్యత రేటు 97.4 శాతం ఉండగా.. స్త్రీలలో 95.2 శాతం ఉంది. ఏపీలో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతం ఉండగా.. మహిళల్లో 59.5 శాతంగావుంది. 
 
కాగా, ఈ సర్వేను 2017 జూలై నుంచి 2018 జూన్‌ నడుమ దేశవ్యాప్తంగా 8097 గ్రామాల్లో 64,519 మందిని.. పట్టణప్రాంతాల్లో 49,238 మందిని ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న గ్రామీణప్రాంతాలవారిలో 4 శాతం మంది ఇళ్లల్లో, పట్టణప్రాంతాల వారిలో 23 శాతం మంది ఇళ్లల్లో కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది.