1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (09:39 IST)

పారిపోయిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి - లుకౌట్ నోటీసు జారీ

pinnelli ramakrishna reddy
మాచర్ల జిల్లా పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అధికార వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్రం విడిచి పారిపోయాడు. పైగా, ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే పోలీసులు ఆయనకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసు జారీ చేసి అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. 
 
ఈ ఈవీఎం విధ్వంసం కేసులో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమై లుకౌట్ నోటీసులు జారీచేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అందులో పేర్కొంటూ అన్ని విమనాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పైగా, పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 120 బీ, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఇప్టికే ఏ1గా కోర్టులో మెమో దాఖలు చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో పిన్నెల్లి అరెస్టు కోసం రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం రావడంతో తెలంగాణా పోలీసులతో కలిసి గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిరిలో పిన్నెల్లి కారును గుర్తించారు. అయితే, కారులో ఆయన కనిపించలేదు. కానీ పిన్నెల్లి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పిన్నెల్లి అరెస్టు అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆయన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత పిన్నెల్లి కోసం ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.