మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఏప్రియల్ 2025 (09:32 IST)

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ap rains
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులకు అపారనష్టం మిగిల్చాయి. చేతికొచ్చిన పంట నీటమునిగింది. దీంతో రైతుు లబోదిబో మంటున్నారు. ఇప్పటివరకు అకాల భారీ వర్షాలతో రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో రైతులకు వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు పయనిస్తుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
అయితే, దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
 
అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్న ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటపుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పని చేసే రైతులు వ్యవసాయ కూలీలు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద ఉండకుండా సురక్షి ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచన చేసింది. 
 
మరోవైపు, ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8, ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో 40.7, నంద్యాలలో 40.6, పల్నాడులో40.5, శ్రీకాకుళం జిల్లా పొందూరులో 40.3 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందని వెల్లడించారు.