1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (11:46 IST)

విజయం కిక్కులో మంత్రి పెద్దిరెడ్డి, అవి కూడా పెట్టేయాలని నిమ్మగడ్డకు విజ్ఞప్తి

విజయం సాధిస్తుంటే వచ్చే ఆనందమే వేరు. క్రికెట్ ఆటలో చూడండి.. ఇక మనం గెలుస్తాం అని అనుకుంటే ఛాతీ విప్పారుతుంది. విజయదరహాసం తొణకిసలాడుతుంది. వరుస విజయాలు లభిస్తుంటే ఆ కిక్కే వేరు. ఇప్పుడు అలాంటి కిక్కులో వున్నారు వైసిపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.
 
తిరుపతి లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ఈ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి కనీసం 3 లక్షల బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తారన్న నమ్మకముందన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు సుమారు 16 లక్షల వరకూ వున్నారు. మంత్రి లెక్కల ప్రకారం కనీసం 10 లక్షల ఓటర్లు వైసిపి పక్షాన వున్నట్లే.
 
ఇకపోతే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన క్రమంలో పనిలోపనిగా వెంటనే జెడ్పీ, ఎంపిటిసి ఎన్నికలు కూడా పెట్టేయాలని పెద్దిరెడ్డి అన్నారు. ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ హయాంలోనే ఈ ఎన్నికలు కూడా జరిగిపోతే ఆ తర్వాత తాము వ్యాక్సిన్ ప్రోగ్రాం చేసుకుంటామన్నారు. వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే వారం రోజుల్లో ముగించేస్తామన్నారు. మరి ఎస్ఇసి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.