శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

త్రీ క్యాపిటల్స్ రభస : అమిత్ షాకు ఆర్ఆర్ఆర్ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశం చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. త్రీ క్యాపిటల్స్‌కు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఆ దిశగా తెరవెనుక చర్యలు చేపట్టింది. మరోవైపు, మూడు రాజధానులను విపక్ష పార్టీలతో పాటు.. అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అధికార వైకాపాకు చెందిన నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన లేఖల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా, మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పార్లమెంటులో ఆమోదించిన విభజన చట్టానికి అసెంబ్లీలో సవరణ చేశారని, అది చెల్లదని వెల్లడించారు. 
 
విభజన చట్టంలో లేని విధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్లమెంటులో చట్టాన్ని సవరించినప్పుడే మూడు రాజధానులకు చట్టబద్ధత వస్తుందన్నారు. 
 
ఈ విషయాన్ని గమనించే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నానని అమిత్ షాకు రాసిన లేఖలో రఘురామ వివరించారు. ఇటీవల జలవివాదాన్ని పరిష్కరించినట్టే, 3 రాజధానుల అంశాన్ని కూడా కేంద్రమే పరిష్కరించాలని ఆయన తన లేఖలో కోరారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఆర్ఆర్ఆర్ స్పందిస్తూ, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేనంత ఆర్థిక దుస్థితి ఏపీలో ఉందని రఘురామ ఆందోళన వ్యక్తంచేశారు.