శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (09:29 IST)

నడవలేని స్థితిలో రఘురామరాజు.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి... ఆర్మీ వైద్యుల సహకారంతో..

వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును నడవలేని స్థితిలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్కార్ట్‌ వాహనం దిగి మిలిటరీ అంబులెన్స్‌లో ఎక్కే సమయంలో నడవలేక ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. నడవలేక ఫుట్‌పాత్‌ గోడపైనే కూర్చొండిపోయారు. 
 
ఆతర్వాత ఆర్మీ అధికారులు ఆయనను అంబులెన్స్‌లో ఎక్కేందుకు సహకరించారు. అప్పటికే ఎంపీ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొన్నారు. సీఐడీ అధికారుల అనుమతితో వారు ఆయనతో మాట్లాడారు. న్యాయం గెలుస్తుంది.. ధైర్యంగా ఉండండంటూ ఈ సమయంలో కుటుంబ సభ్యులకు రఘురామ భరోసా ఇచ్చారు. 
 
అక్కడే ఉన్న మీడియాతో రఘురామ మాట్లాడే ప్రయత్నం చేయగా.. అధికారులు అనుమతించలేదు. దీంతో ఏపీలో తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని మాత్రమే ఆయన  వెల్లడించారు. ఏపీ సీఐడీ అధికారులు తనను కొట్టారని పలుమార్లు కోర్టుకు విన్నవించుకోవడంతో సికింద్రాబాధ్‌ మిలటరీ ఆస్పత్రికితరలించి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు బెంచ్‌ ఆదేశాలు చేసిందని తెలిపారు. 
 
కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో ఆర్మీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యనిపుణుల బృందం ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహిస్తుందని ఆర్మీ అధికారులు సోమవారం రాత్రి ఓప్రకటనలో తెలిపారు. 
 
వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో వీడియో తీసి కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. కాగా, ఏపీ నుంచి వచ్చిన ఎంపీ అభిమానులు ఆర్మీ ఆస్పత్రి వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఆర్మీ ఆస్పత్రి ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.