శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:45 IST)

గెలిచినా.. ఓడినా... దాన్ని మాత్రం వదలను : నాగబాబు

జనసేన పార్టీ నేత, నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముగిసిన తొలిదశ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేశారు. ఈనెల 11వ తేదీన పోలింగ్ ముగిసింది. గత నెల రోజుల పాటు తీరకలేకుండా ప్రచారం చేసి అలసిపోయిన నాగబాబు.. ఇపుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
మరోవైపు, ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న జబర్దస్త్ హాస్యభరిత కార్యక్రమం ప్రముఖ టీవీలో కొన్నేళ్లుగా సాగుతోంది. ఈ షోకు నాగబాబుతో పాటు వైకాపా మహిళా నేత ఆర్.కె.రోజా కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో నాన్‌స్టాప్‌గా నవ్వులు పూయించడంలో ఈ ఇద్దరి పాత్ర ఎంతో వుంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టిపెట్టి, జబర్దస్త్ కార్యక్రమానికి దూరమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'జబర్దస్త్' అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలకి నాలుగు రోజులు మాత్రమే షూటింగు ఉంటుంది. ఆ నాలుగు రోజులు ఎలాగో అలా నేను సర్దుబాటు చేసుకుంటాను. ఒకవేళ ఎంపీగా గెలిచినా ఈ షో చేయడం మానుకోను. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటాను. రాజకీయ రంగంలో ఒకవైపున పదవులు నిర్వహిస్తూనే.. మరో వైపున టీవీ షోలకి న్యాయనిర్ణేతలుగా పనిచేసిన వాళ్లు చాలామందే వున్నారు అని చెప్పుకొచ్చారు.