గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (14:32 IST)

నారా లోకేష్‌కు షాకిచ్చిన పోలీసులు : తొలిసారి అరెస్టు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. ఆయన్ను తొలిసారి అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరులో ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా తదితర నేతలు పరామర్శించారు. 
 
ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో రాజకీయ లబ్ధి కోసమే నారా లోకేశ్ వచ్చారంటూ వైసీపీ శ్రేణలు ఆరోపించాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. 
 
అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్, నరేంద్ర, ఆనంద్ బాబు, ఆలపాటి రాజాలతో పాటు పలువురు నేతలను అరెస్టు చేశారు.
 
లోకేశ్‌ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ వాహనంలోకి ఎక్కే సమయంలో నారా లోకేశ్ పిడికిలి బిగించి, చేయెత్తి టీడీపీ శ్రేణులను ఉత్తేజపరిచారు. మరోవైపు మిగిలిన నేతలను నల్లపాడు పీఎస్‌కు తరలించారు. లోకేశ్ అరెస్టుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తన రాజకీయ జీవితంలో నారా లోకేశ్ అరెస్టు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.