శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (09:38 IST)

ఆంగ్లం వద్దు.. మాతృభాషే ముద్దు : వైకాపా ఎంపీ రఘురామరాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టడాన్ని అధికార వైకాపాకు చెందిన ఎంపీ రఘురామరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంగ్ల భాష వద్దు అని.. మాతృభాషే ముద్దు అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రారంభమైం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యాఖ్యానించారు. మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యతనీయాలని కోరారు. 
 
ఇదే అంశంపై సభలో జరిగిన చర్చపై ఆయన మాట్లాడుతూ, 'మాతృభాషా పరిరక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 350, 350ఎ అధికరణాల స్ఫూర్తి దెబ్బతినకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ అధికరణాల్లో 350.. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధనకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి ప్రస్తావిస్తుంది. 350 ఏ అనేది ఎవరైనా ప్రాంతీయ భాషలో తమ సమస్యలను చెప్పుకొనేందుకు అవకాశం కల్పిస్తుంది అని గుర్తుచేశారు. 
 
కాగా, ప్రాచీన భాషా కేంద్రం గురించి తెలుగుదేశం సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు రఘురామ రాజు అనుబంధ ప్రశ్న వేశారు. తెలుగు అకాడమీని విభజించేందుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. 'తెలుగు అకాడమీకి చెందిన వందల కోట్ల నిధులు హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. విభజన చట్టంలోని 10వ షెడ్యూలులో అకాడమీ ఉన్నది. ఈ చట్టం ప్రకారం అకాడమీకి చెందిన నిధులను 58:42 నిష్పత్తిలో విభజించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు' అని ప్రశ్నించారు. 
 
ఇదిలావుంటే, ఒక వైపు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ.. రాష్ట్రంలో తెలుగుభాషలో విద్యాబోధనను రద్దు చేస్తామని ప్రకటించగా, అదే పార్టీకి చెందిన ఎంపీ మాత్రం తద్భిన్నమైన వాదనను లోక్‌సభలో సోమవారం లేవనెత్తడం గమనార్హం. దీనిపై ఏపీ సీఎం జగన్‌తో పాటు ఆయన పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, నేతలు ఏమంటారో వేచిచూడాల్సిందే.