శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (09:02 IST)

కోవిడ్-19 సమాచారం కావాలా?.. అయితే 104 కాల్ సెంటర్ ను సంప్రదించండి

కోవిడ్-19 లక్షణాలు కాస్తంత కనిపించినా కంగారు. పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి? ఎవరిని ఎలా సంప్రదించాలి? పాజిటివ్‌ అయితే ఏ ఆస్పత్రికెళ్లాలి? ఇలా బాధితులకు ఎన్నో సందేహాలు. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్‌ కు ఫోన్ చేయగానే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకున్నారు.
 
* 104 నంబర్‌కు కాల్‌ చేస్తే రాష్ట్రంలో కరోనా నియంత్రణకు, నిర్ధారణకు, చికిత్సకు అవసరమైన ఆస్పత్రుల వివరాలు ఇలా ప్రతి సమాచారం వెంటనే ఇస్తారు. 
 
* ఫోన్‌ చేసిన అర గంటలోపే బాధితుడిని ఆదుకునేలా ఏర్పాటు చేసిన ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా రోజూ  వేలాది మంది సేవలు పొందుతున్నారు.  
 
* రాష్ట్ర స్థాయిలో ఒకటి, ప్రతి జిల్లాకొకటి చొప్పున పనిచేస్తున్న ఈ 104 కాల్‌సెంటర్లను 24 గంటలూ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. 
 
కరోనా సమాచారం ఇలా.. 
* రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులు  అందులో ఖాళీగా ఉన్న బెడ్లు వివరాలతో పాటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, వాటిలో ఎన్ని పడకలు ఉన్నాయి అనే సమాచారం కూడా తెలుసుకోవచ్చు.   
* దీర్ఘకాలిక జబ్బులతో ఉన్నవారికైతే స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రుల సమాచారం, పడకల వివరాలు ఇస్తారు. 
* కరోనా టెస్టింగ్‌ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? ఎన్ని గంటలకు వెళ్లాలి వంటి సమాచారం కూడా చెప్తారు. 
* కోవిడ్‌ సేవలందించే ప్రైవేటు ఆస్పత్రులు, అక్కడ పడకల సమాచారం కూడా ఇస్తారు. 
 
ఇలా 104కు కాల్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చు ...
* 104కు కాల్‌ చేయగానే మీకు ఎలాంటి సేవలు, సమాచారం అవసరమో అడుగుతారు 
* 1 నొక్కితే సాధారణ ఆరోగ్య సమస్యలపై స్పందిస్తారు. 
* 2 నొక్కగానే కరోనా సమస్యలపై స్పందిస్తారు. 
* కాల్‌సెంటర్‌ ప్రతినిధి ఫోన్‌ చేసిన బాధితుడి నుంచి పూర్తి వివరాలు, ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుంటారు. 
* ఆయాసం లేదా ఇతర కరోనా సమస్యలతో పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే ఆ జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం ఇస్తారు.
* మరీ అత్యవసరమైతే 30 నిమిషాల్లోపే ఆ వ్యక్తి వద్దకు అంబులెన్స్‌ పంపించి ఆస్పత్రికి చేర్చేలా చర్యలు తీసుకుంటారు. 
* బాధితుడు ఆస్పత్రికి చేరుకునేలోపు వైద్యులకు సంబంధిత వ్యక్తి సమాచారం పంపుతారు.
 
ఆన్ లైన్లో కోవిడ్ పరీక్షకు దరఖాస్తు:
కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా కోవిడ్ పరీక్షకు రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. మీ క్లస్టర్ లో ఎవరికైనా కోవిడ్ టెస్ట్ చేసుకోదలిస్తే ఈ లింక్ ఓపెన్ చేసి 
http://covid19.ap.gov.in/Covid19_Admin/RequestForTest.html
సంబంధిత వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం నింపాలి. సంబంధిత అధికారి వారితో కాంటాక్ట్ అయి టెస్ట్ చేయించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.  ఈ క్రింది లింక్ ఓపెన్ చేయండి. 
 
ఆస్పత్రుల వివరాల కోసం కోవిడ్‌-19 డాష్‌ బోర్డు 
కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం కూడా బాధితులకు చికిత్స అందిందుకు అవసరమైన ఆస్పత్రుల సంఖ్యను కూడా అంతేస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రుల వివరాలు, మొత్తం పడకల సంఖ్య, ఖాళీగా ఉన్న పడకలు, ఐసీయూ, ఆక్సిజన్‌తో కూడిన సాధారణ బెడ్లు, వెంటిలేటర్‌ బెడ్లు సంబంధిత వివరాలన్నీ ఆన్ లైన్ లో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. 

http://dashboard.covid19.ap.gov.in/ims/hospbed_reports/ అనే వెబ్‌లింక్‌ను క్లిక్‌ చేసి ఆయా జిల్లాల పేరు మీద క్లిక్‌ చేసి ఆయా జిల్లాల్లోని బెడ్ల వివరాలు తెలుసుకోవచ్చు. దీనివల్ల రోగులను బెడ్లు ఖాళీగా ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లే వీలు కలుగుతుందని అధికారులు చెప్పారు.  
 
అంతేకాకుండా  వై.ఎస్.ఆర్. టెలీమెడిసిన్ ద్వారా 14410కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ తో మాట్లాడి ఆరోగ్య సమస్యలను తెలపవచ్చు.
 
కోవిడ్-19 కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం 8297104104 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయొచ్చు లేదా 8297104104 నెంబర్ కు డయల్ చేసి ఐవిఆర్ఎస్ ద్వారా సమాచారం పొందవచ్చు.