శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2019 (11:41 IST)

స్టేజీని నమోదు చేసేందుకు ఇక అలా చేయనక్కర్లేదు.. యాప్ వచ్చేసింది..

ఇళ్ల నిర్మాణ స్థాయి (స్టేజీ)ని నమోదు చేయటానికి లభ్దిదారులు ఇకపై అధికారుల చుట్టు తిరిగే పనిలేదు. బిల్లుల పెండింగ్ వివరాలను తెలుసుకోవటానికి కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు. 
 
గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి అరచేతిలోనే అన్ని విషయాలు తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్​ను అందుబాటులోకి తేనుంది. దీనికి గృహరక్ష, గృహమిత్ర పేర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. 
 
 
త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యాప్​ను ఆవిష్కరించనున్నారు. ఆండ్రాయిడ్ సెల్​ఫోన్లు ఉన్న వారు దీన్ని డౌన్​లోడ్ చేసుకోవచ్చు. 
 
లబ్ధిదారుడు యాప్​లో నమోదు చేసిన సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలి. లేకపోతే అది గృహ నిర్మాణ శాఖ ఏఈ నుంచి డీఈకి అక్కడి నుంచి మరో రెండు రోజుల్లో ఈఈకి చేరేలా రూపొందించారు. 
 
 
ఈ యాప్​ను గ్రామ సచివాలయ వెబ్​సైట్​కు అనుసంధానిస్తారు. లబ్ధిదారులు నమోదు చేసిన వివరాల ఆధారంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు తదుపరి చర్యలు తీసుకుంటారు.
 
ఉపయోగాలు ఇవీ...
 
* ఇంటి కోసం లబ్ధిదారులే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
* ఇల్లు మంజూరైనది, లేనిదీ తెలుసుకోవచ్చు.
 
* గృహ నిర్మాణ ఏ స్థాయిలో ఉందో లబ్ధిదారే ఫోటో తీసి అప్​లోడ్​ చేయవచ్చు.
 
* బిల్లుల పెండింగ్​ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయవచ్చు.
 
* ఇళ్ల మంజూరు, బిల్లు నమోదుకు అధికారులు లంచాలు అడిగితే ఫిర్యాదు చేసే అవకాశాన్నీ కల్పించారు.
 
* తెలుగు, ఆంగ్లం రెండింటిలోనూ వివరాల నమోదుకు అవకాశం ఉంది.
 
* రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పథక వివరాలు ఇందులో ఉంటాయి.