1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (08:54 IST)

పచ్చని పందిరి సాక్షిగా ఒక్కటైన జంట... కాళ్ల పారాణి ఆరకముందే వెళ్లిపోయింది...

new couple
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తీవ్ర విషాదం జరిగింది. పచ్చని పందిరి సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట.. కాళ్ల పారాణి ఆరకముందే లోకం విడిచి వెళ్లిపోయింది. వారి జీవన ప్రయాణానికి విధి ముగింపు పలికింది. ఇళ్లకు కట్టిన తోరణాలు వాడటకముందే ఆ కుటుంబంలో చావు డప్పులు మోగాయి. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలోని బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు వేణు అలియాస్ సింహాచలం (26) అనే యువకుడికి బ్రహ్మపురకు చెందిన సుభద్ర అలియాస్ ప్రవల్లిక (23) ఈ నెల 10వ తేదీ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. సింహాచలం పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో బంధుమిత్రులంతా పాల్గొన్నారు. ఆ తర్వాత 12వ తేదీన విందు ఏర్పాటు చేశారు. 
 
ఈ విందుకు అందరూ వచ్చి భోజనం చేసి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలు ముగియడంతో అత్తారింటికి నవ దంపతులు బైకుపై బయలుదేరారు. వీరి వాహనం గొళంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో వెళుతుండగా, ఓ ట్రాక్టర్ బలంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభద్ర అక్కడే మృత్యువాతపడగా వేణును మాత్రం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఈ విషాద వార్త తెలుసుకున్న ఇరువురు కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. వారు ఆర్తనాదాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. కాళ్ళపారాణి ఆరకముందే నవ దంపతులు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారంటూ ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు.