విశాఖపట్నం: క్వెస్ట్ అలయన్స్, సమగ్ర శిక్ష (ఎస్ఎస్ఏ ఏపి), లీడర్షిప్ ఫర్ ఈక్విటీ(ఎల్ఎఫ్ఈ) భాగస్వామ్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం లోని 100 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో 7, 8, 9 తరగతుల పిల్లల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు- ఏఐ) పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవటంతో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ మైలురాయిని వేడుక చేసుకోవటంలో భాగంగా, విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో జూన్ 14 నుండి 17 వరకు నాలుగు రోజుల పాటు "హ్యాక్ టు ది ఫ్యూచర్ ఆంధ్ర 2025" కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తుకు అనుకూలమైన అభ్యాసాన్ని వేడుక జరుపుకోవడంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా నాయకులను ఒకచోట చేర్చింది.
ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కెజిబివిలు), ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్(ఏపిఎంఎస్), ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు(జిహెచ్ఎస్)లలో నిర్వహించారు. ప్రాథమిక ఏఐ నేపథ్యాలు, భవిష్యత్తు నైపుణ్యాలు, కెరీర్ విద్యను అభ్యాసకులకు ఈ కార్యక్రమం పరిచయం చేసింది. ఇది ఉపాధ్యాయులకు సాంకేతికతతో కూడిన సమగ్ర అభ్యాసాన్ని సులభతరం చేయడానికి ఉపకరణాలు, శిక్షణను కూడా అందించింది.
సారవకోటలోని కెజిబివిలో తెలుగు బోధించే ఉపాధ్యాయిని జి శ్రీదేవి మాట్లాడుతూ, “సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా కలిగిన తెలుగు ఉపాధ్యాయురాలిగా, నేను బోధించడానికి ఎక్కువగా కవితలు, కథలపై ఆధారపడుతుంటాను. క్రమంగా, నా విద్యార్థులను బోధనాంశంలో లీనం చేయడానికి నేను చిన్న యాప్లు, ఐఎఫ్ పి ప్యానెల్లను ఉపయోగించడం ప్రారంభించాను. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రాజెక్టులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించమని చెప్పినప్పుడు, నేను చేయగలనా అని అనిపించింది. కానీ శిక్షణ పొందిన తర్వాత, నా విద్యార్థుల ఉత్సాహాన్ని చూసి నేను మరింత నేర్చుకోవడానికి స్ఫూర్తిని పొందాను. నేటి ప్రపంచంలో సాంకేతికతను తెలివిగా ఉపయోగించుకునేలా మార్గనిర్దేశం చేయడం యొక్క ఆవశ్యకతను ఏఐ నాకు చూపించింది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని సత్కరించిన ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రోగ్రామ్ డైరెక్టర్ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులకు కృత్రిమ మేధస్సును పరిచయం చేయడం మాత్రమే కాదు, ఇది స్వర్ణ ఆంధ్ర 2047 అంటోన్న రాష్ట్రం యొక్క మహోన్నత లక్ష్యంను సజీవంగా తీసుకురావడం గురించి, ఇక్కడ దేశానికి ఏఐ కేంద్రంగా ఆంధ్ర అవతరించనుంది. ఏఐ, కెరీర్ విద్యను పాఠ్యాంశాల్లోకి చేర్చడం ద్వారా, యువ అభ్యాసకులు వాస్తవ ప్రపంచ సమస్యలను అన్వేషించడానికి, ఉద్భవిస్తున్న కెరీర్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి మేము సహాయం చేస్తున్నాము. ఇది మార్పుకు సృష్టికర్తలుగా మారడానికి వారిని శక్తివంతం చేస్తుంది. రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంతటా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హ్యాకథాన్ బూట్క్యాంప్, ప్రోటోటైప్ షోకేస్, ఉపాధ్యాయ గుర్తింపు వేడుక, జరిగాయి. మూడు బృందాలలో పనిచేస్తున్న ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు, 13 మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో స్థానిక సమస్యలను పరిష్కరించడానికి ఏఐ-ఆధారిత ప్రోటోటైప్లను అభివృద్ధి చేశారు. వ్యర్థాల నిర్వహణ నుండి ప్రజా సేవలను అందుబాటులో తీసుకురావటం వరకు ఉన్న సమస్యలను ఈ ప్రాజెక్టులు పరిష్కరించాయి. ప్రొఫెసర్లు, నిధులు అందించేవారు, విద్యావేత్తలు, రాష్ట్ర అధికారులతో కూడిన నిపుణుల ప్యానెల్కు అవి సమర్పించబడ్డాయి.
గీతం విశ్వవిద్యాలయం యొక్క కంప్యూటర్ ల్యాబ్లను కూడా వినియోగించుకునే అవకాశం విద్యార్థులకు కలిగింది, అక్కడ వారు వాస్తవ ప్రపంచ ఉపకరణాలు, మార్గదర్శక అభిప్రాయాన్ని ఉపయోగించి తమ ఆలోచనలను పరీక్షించుకోవటంతో పాటుగా మెరుగుపరుచుకోగలిగారు. విశ్వవిద్యాలయంలో తొలి దశలోనే లీనం చేయడం వల్ల విద్యార్థులకు ఉన్నత విద్యా మార్గాలు పరిచయం అయ్యాయి. కెరీర్ అవకాశాలు కూడా విస్తరించాయి. ముందుగానే తగిన రీతిలో కెరీర్ ప్రణాళిక చేసుకోవటంలో ఇది తోడ్పడింది. గత సంవత్సర కాలంగా పాఠ్యాంశాలను అందుబాటులోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన విద్యావేత్తలు, విద్యలో ఆవిష్కరణలకు తమ నాయకత్వం, నిబద్ధతకు గుర్తింపు పొందారు.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, ఏపిఎంఎస్ పురుషోత్తపురం నుండి వచ్చిన విద్యార్థిని జాహ్నవి, తన గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యను పరిష్కరించే రీతిలో ఒక నమూనాను ప్రదర్శించారు. సాంప్రదాయకంగా, వారు దిగుబడి లేదా లాభదాయకతను పరిగణనలోకి తీసుకోకుండా వరిని మాత్రమే పండిస్తారు. ఇటీవలి సంవత్సరాలలో, ఆకస్మిక, భారీ వర్షాలు పంటలను నాశనం చేశాయి, దీనివల్ల రైతులు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడం కష్టతరం అయింది.
జాహ్నవి తన ఆలోచనను వివరిస్తూ, "మా అప్లికేషన్ను అమెజాన్ పార్టీ రాక్ ఏఐ ప్లాట్ఫామ్ను ఉపయోగించి రూపొందించాము. ఇది వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం ద్వారా, మార్కెట్ ధోరణుల ఆధారంగా అధిక డిమాండ్ ఉన్న పంటలను గుర్తించడం ద్వారా వినియోగదారులకు సహాయపడుతుంది. ఇది భూసారం, స్థానిక వాతావరణాన్ని విశ్లేషించడం ద్వారా అత్యంత లాభదాయకమైన పంటలను కూడా సూచిస్తుంది" అని అన్నారు.
క్వెస్ట్ అలయన్స్లోని స్కూల్స్ టీమ్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సమీర మాట్లాడుతూ, “మా విద్యార్థులు సాంకేతికతను కేవలం నిష్క్రియాత్మకంగా ఉపయోగించుకోవాలని మేము కోరుకోవడం లేదు. వారు సమానమైన, నైతిక స్పృహ కలిగిన, సాంస్కృతికంగా సంబంధితమైన, మన దేశ అవసరాలకు అనుగుణంగా ఉండే భవిష్యత్తు సాంకేతికతల సృష్టికర్తలుగా మారాలని మేము కోరుకుంటున్నాము. ఈ నమూనా కార్యక్రమం, ముగింపు కార్యక్రమం అదే ఉద్దేశ్యంతో రూపొందించబడ్డాయి. ఈ ప్రోగ్రామ్ కాలంలో, మేము ఇప్పటికే ఆశాజనకమైన ఫలితాలను గమనించాము. విద్యార్థులు నేర్చుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పాదకంగా ఉపయోగించడంలో 103% పెరుగుదల నమోదు చేయటం గమనించాము, విద్యావేత్తలు- విద్యార్థుల మధ్య కెరీర్ సంబంధిత సంభాషణలలో 10.4% పెరుగుదల, ఏఐ-సంబంధిత నైపుణ్యాలు, నైతిక అవగాహనలో 5-6% మెరుగుదల కూడా చూసాము. ఇవేవీ సులభమైన మార్పులు కావు- వీటికి సమయం, కృషి- మనస్తత్వ మార్పు అవసరం. కానీ ముఖ్యంగా వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో, ఏఐతో నిమగ్నమవ్వడానికి వ్యవస్థ సంసిద్ధత, ఉత్సుకత రెండింటినీ చూపించడం చూడటం సంతోషంగా ఉంది.
ముందుకు చూస్తే, రాబోయే 3-5 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మన విద్యావేత్తలు, పాఠశాల నాయకులు, విద్యార్థులు, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారుల నిబద్ధతకు మేము కృతజ్ఞులం. మన ప్రభుత్వ విద్యా వ్యవస్థలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న తరగతి గదులను వాస్తవంగా మార్చడంలో వారి సమిష్టి కృషి కీలక పాత్ర పోషించనుంది " అని అన్నారు. కంప్యూటేషనల్ థింకింగ్, నైతిక పద్దతులలో ఏఐ వినియోగం, కెరీర్ సంసిద్ధత వంటి భవిష్యత్ నైపుణ్యాలను ప్రధాన స్రవంతి ప్రభుత్వ విద్యలో పొందుపరచడానికి జరిపే ఒక పెద్ద ఉద్యమంలో ఈ కార్యక్రమం భాగం. రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నమూనాను విస్తరింప చేయడానికి ఒక వేడుకగా మరియు చర్యకు పిలుపుగా ఈ కార్యక్రమం పనిచేస్తుంది.