మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఢీకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా రెండు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.
బుధవారం ఉదయం జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం ఏటుకూరు బైపాస్ వద్ద సింగయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
మరో ఘటనలో సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ రాక సందర్భంగా ఏర్పడిన జనసందోహం, తోపులాటలో వైకాపా కార్యకర్త జయవర్ధన్ రెడ్డి ఊపిరాడక సొమ్ముసిల్లిపడిపోయాడు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.