1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 25 నవంబరు 2022 (22:20 IST)

భారత రాజ్యాంగం సజీవ పత్రం: గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా

Sisodia
మారుతున్న సమాజం, ప్రజల అవసరాల అనుగుణంగా సవరణలకు పూర్తి అనుకూలంగా ఉన్నందున భారత రాజ్యాంగం సజీవ పత్రంగా ప్రపంచ రాజ్యాంగ మేధావుల పిలుపును అందుకుంటుందని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. 73వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్‌, న్యూఢిల్లీ లోని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిసోడియా కీలకోపన్యాసం చేసారు. 'భారత రాజ్యాంగం యొక్క తత్వశాస్త్రం' అనే అంశంపై సిసోడియా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రూపొందించడానికి నాడు చేసిన ప్రయత్నాల గురించి ప్రజలకు తెలియనప్పటికీ, నేడు వారి జీవన గమనం సజావుగా సాగుతున్నందున రాజ్యాంగాన్ని సాధారణంగా తీసుకుంటున్నారన్నారు.
 
భారతదేశంతో పాటు స్వాతంత్ర్యం పొందిన పొరుగు దేశాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, వారు తొమ్మిదేళ్ల తర్వాత మాత్రమే తమ రాజ్యాంగాన్ని తీసుకురాగలరని, మనం స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లలోపే భారత రాజ్యాంగాన్ని ఆమోదింప చేసుకున్నామని గుర్తు చేసారు. పొరుగు దేశ రాజ్యాంగం భారత రాజ్యాంగ స్దాయిని అందుకోలేక పోయిందన్నారు. మనం అందరం అనుభవిస్తున్న అధికారానికి మన రాజ్యాంగమే మూలమని వసుధైవ కుటుంబం, సత్యమేవ జయతే, సర్వజన హితయ, సర్వజన సుఖాయ వంటి మన ప్రాచీన సూత్రాల ప్రకారం రాజ్యాంగం పౌరులందరికీ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుందని సిసోడియా అన్నారు. రాజ్యాంగం అందించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనకు బాగా సరిపోతుందన్నారు. స్థిరమైన ప్రభుత్వాలు కొనసాగసాగేలా రాజ్యాంగం స్పష్టత నిచ్చిందని, ఫలితంగానే ప్రపంచంలో భారత దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించిందన్నారు. ఫెడరలిజం అనేది రాజ్యాంగం యొక్క తత్వశాస్త్రం, ఆత్మ వంటిదన్నారు.
 
ఒకప్పుడు భారత దేశాన్ని పరిపాలించిన యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇప్పుడు భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రభుత్వానికి సారథ్యం వహించడంతో చరిత్ర పూర్తి వృత్తాన్ని తీసుకున్నట్లయ్యిందన్నారు. సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ స్వభావం మన రాజ్యాంగం యొక్క ప్రత్యేక లక్షణంగా ఉందన్నారు.  ప్రపంచంలోనే అత్యుత్తమ తత్వవేత్తగా నిలిచిన ఆచార్య నాగార్జున ఖ్యాతిని కొనసాగించాలని సిసోడియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉద్బోధించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి అచార్య పి.రాజ శేఖర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, రెక్టార్ అచార్య పి.వరప్రసాద మూర్తి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్ నుండి అచార్య వై అశోక్ కుమార్, రిజిస్ట్రార్ అచార్య బి. కరుణ, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ అచార్య స్వరూప్ రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.