శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (14:39 IST)

హీరో కృష్ణ పార్థివదేహానికి వెంకయ్య - చంద్రబాబు - పవన్ నివాళులు

krishna
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు నివాళులు అర్పించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ మంగళవారం వేకువజామున తుది శ్వాస విడిచిన విషయం తెల్సిందే. దీంతో ఆయన పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని నివాసానికి తరలించారు. అక్కడ సినీ, రాజకీయ నేతలు కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
 
వీరిలో వెంకయ్య నాయుడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు. కృష్ణ మరణం పట్ల తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పవన్ వచ్చిన సమయంలో మహేష్ బాబు కూడా తన తండ్రి పార్థివదేహం వద్దే ఉన్నారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న మహేష్‌ను పవన్ ఓదార్చారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. 
 
అలాగే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, దర్శకులు బోయపాటి శ్రీను, మంచు విష్ణు తదితరులు కూడా భౌతికకాయానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేష్‌లు మహేష్ బాబును తమ పక్కనే కూర్చోబెట్టుకుని ధైర్యం చెప్పారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ కృష్ణ ఇంటిలోనే ఉన్నారు.