గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (08:35 IST)

జగన్ ప్రభుత్వానికి చెప్పుదెబ్బలు ఖాయం: మాజీ మంత్రి పీతల సుజాత

“నీకోసం జీవిస్తే, నీలోనే నిలిచిపోతావు, అదే జనంకోసం జీవిస్తే వారి గుండెల్లో నిలిచిపోతావు” అని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చెప్పారని, కానీ జగన్ ఆలోచనలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని, రాష్ఠ్రంలో దళితులపై దాడులు, వేధింపులు, హత్యలు ,అత్యాచారాలు జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని, జరిగే దారుణాలన్నీ ఆయనకు తెలిసే జరుగుతున్నాయని మాజీమంత్రి పీతలసుజాత స్పష్టంచేశారు.

ఆమె తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.  తాను అధికారంలోకి రావడానికి కారణమైన దళితులపై దాడులు, శిరోముండనాలుజరుగుతున్నా, ముఖ్యమంత్రి తనకేమీ పట్టనట్లుగా ఉంటున్నాడని, ఆయన వైఖరిచూస్తుంటే, జరిగేవన్నీ ఆయనకు తెలిసే జరుగుతున్నాయన్నారు.

వైసీపీప్రభుత్వంలో దళితులు, గిరిజనులపై జరిగినన్ని దాడులు రాష్ట్రచరిత్రలో మరి ఏప్రభుత్వంలోనూ జరగలేదన్నారు. చంద్రబాబునాయుడు దళితుల రాకీయ, ఆర్థిక, విద్యాభివృద్ధికోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందిస్తే, జగన్ రాగానేవాటిని రద్దుచేశాడన్నారు. దళితుల సంక్షేమానికి ఏమీచేయకపోగా, కొత్తగా జగన్ ప్రభుత్వం శిరోముండనాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలను దళితులకు కానుకగా ఇచ్చిందన్నారు.

అనాగరికంగా శిరోముండనం వంటి ఘటనలను కొత్తగా రాష్ట్రప్రజలకు పరిచేయం చేసింది జగన్ ప్రభుత్వం కాదాఅని సుజాత నిలదీశారు. దళితులు ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను లాక్కొని పేదలకు ఇస్తామనడం ఏమిటన్నారు? జగన్ ప్రభుత్వంవచ్చాక,  దళితులపై జరిగిన అఘాయిత్యాల వివరాలుతెలియచేస్తూ, టీడీపీ దళిత విభాగం విడుదలచేసిన పుస్తకంలోని అంశాలపై  చర్చించడానికి వైసీపీలోని దళితనేతలెవరైనా సరే చర్చకు రావాలని మాజీమంత్రి సవాల్ చేశారు.

టీడీపీ ప్రభుత్వంలో జరిగిన గరగపర్రు ఘటనపై చంద్రబాబునాయుడు వెంటనేస్పందించి, మంత్రుల కమిటీవేసి, దళితక్రైస్తవులకు కూడా ఆనాడు నష్టపరిహారం అందేలా చేశారన్నారు. అటువంటి చంద్రబాబు దళితద్రోహి ఎలా అవుతాడన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులకు ఇచ్చే ప్రమాదపరిహారం విషయంలో కూడా వివక్షచూపుతున్నారన్నారు. 

దళితులంటే జగన్ కు ఎందుకింత చిన్నచూపో తెలియడం లేదన్న సుజాత, ఇన్ని దారుణాలు వరుసగా జరుగుతున్నా ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలాగన్నారు. న్యాయాన్ని కాపాడే జడ్జిని చిత్తూరులో ఎలా వేధించారో, పీపీఈకిట్లు, మాస్కుల అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని, డాక్టర్ అనితారాణిని ఎంతదారుణంగా హింసించారో, విక్రమ్ హత్యకు, కిరణ్ చావుకు, ఓంప్రతాప్ఆత్మహత్యకు కారకులెవరో ప్రజలందరికీ తెలుసునన్నారు.

వైసీపీనేతలకు ఎంత కండకావరం ఉందో ఓంప్రతాప్ ఘటనతోనే  అర్థమైందన్నారు.  కనీసం పోస్ట్ మార్టమ్ కూడాచేయకుండా అతనిమృతదేహాన్ని ఖననం చేయడమేంటన్నారు. ప్రభుత్వ దారుణాలకు బలైన దళిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లే టీడీపీనేతలను కూడా అడ్డుకుంటున్నారన్నారు.

వైసీపీప్రభుత్వం దళితులను ఓటుబ్యాంకుగానే చూస్తోందని, వరప్రసాద్ కు శిరోముండనం చేసిన కృష్ణమూర్తిని అరెస్ట్ చేయకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అంబేద్కర్ కులవివక్షను, అంటరాని తనాన్ని రూపుమాపాలని ప్రయత్నిస్తే, వైసీపీ ప్రభుత్వం మారుమూలగ్రామాల్లో కూడా అవి జరిగేలా చేస్తోందన్నారు.  

దళితుల పేరుకు పేదలైతే కావచ్చుగానీ, ఆత్మాభిమానంతో బతకడంలో వారికి వారే సాటని సుజాత తెలిపారు. వరప్రసాద్ ఘటనలో అసలు దోషులను పట్టుకొని ఉంటే, శ్రీకాంత్ కు శిరోముండనం జరిగేదా అని ఆమె ప్రశ్నించారు. ఈ విధంగా జరగరానిదారుణాలు జరుగుతుంటే, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరని, అలా స్పందించని వ్యక్తి దళితులను ఎలా ఉద్ధరిస్తున్నాడో, వైసీపీలోని దళితవర్గపు ప్రజాప్రతినిధులు చెప్పాలన్నారు.

దళితులను రాజకీయపరంగా  ప్రోత్సహించించి ముమ్మాటికీ చంద్రబాబే నన్నారు. దళితయువకులను ఆర్థికంగా బలవంతులను చేయడంకోసం చంద్రబాబు  ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా రుణాలు ఇచ్చి, ఇన్నోవా కార్లకు దళిత యువతను యజమానులను చేశారన్నారు.

దళితమహిళలకు 45శాతం, దళితయువతకు 35శాతం సబ్సిడీ అందచేసి, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేలా చంద్రబాబు వారిని అన్నివిధాలా ప్రోత్సహించారన్నారు. జగన్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో దళితులకిచ్చే సబ్సిడీ మొత్తాన్ని ఎత్తేసిందన్నారు.

ప్రశ్నించినవారిని అరెస్ట్ చేస్తూ, అడ్డమైన కేసులు పెట్టి వేధిస్తున్నది చాలక, దళితులను లక్ష్యంగా ఎంచుకోవడం బాధాకరమన్నారు.  జగన్ ప్రభుత్వంలోని దళితమంత్రులు, ఎమ్మెల్యేలకు అంబేద్కర్ విగ్రహాలు తాకే అర్హత లేనేలేదని సుజాత తేల్చిచెప్పారు.

అంటరాని తనాన్ని, కులవివక్షను రూపుమాపడంకోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొస్తే, దళితవర్గపు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదువులు కాపాడుకోవడం కోసం ఆ రాజ్యాంగానికే తూట్లు పొడుస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై ఎన్ని దాడులు జరిగాయో, ఆయావర్గాలకు ఎంత లబ్దిచేకూరిందో, ఇప్పుడున్న ప్రభుత్వంలో దళితులకుఏం ఒరిగిందో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజా ఒకసందర్భంలో మాట్లాడుతూ, మేమేమీ దళితులం కాదు, మాకు దూరంగా ఉండకండి అంటూ హేళనగా మాట్లాడారన్నారు.  ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ వారు దళితులను కించపరడచమే పనిగా పెట్టుకున్నారన్నారు. దళితులంతా తిరగబడేరోజు త్వరలోనేవస్తుందని, రాజ్యాంగాన్ని కాపాడటంకోసం, జగన్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడంకోసం ప్రాణాలకు తెగించైనా వారు పోరాడతారని సుజాత స్పష్టంచేశారు.

ముఖ్యమంత్రి మాటలతో సరిపెట్టకుండా, మీడియా ముందుకొచ్చి దళితులపై జరుగుతున్న దాడులను ఖండించాలని,  అసలైన దోషులను కఠినంగా శిక్షించాల ని ఆమె డిమాండ్ చేశారు. భవిష్యత్ లో మరెవరూ దళితులపై దారుణాలకు తెగబడకుండా కఠినంగా శిక్షించాలన్నారు. శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన వారిని అరెస్ట్ చేసినట్టే, వరప్రసాద్ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

దళితులు తిరగబడితే వైసీపీప్రభుత్వం భూస్థాపితం అవ్వడం ఖాయమని, వారిచేతుల్లో చెప్పుదెబ్బలు తినడం తధ్యమని పాలకులు తెలుసుకోవాలని సుజాత హితవు పలికారు. దళితులపై జరుగుతున్న దారుణాలన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడే అసలైన దోషులకు శిక్ష పడుతుందన్నారు. పోలీసులు తూతూమంత్రంగా విచారిస్తే, దళితులకు న్యాయం జరగదన్నారు.