1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (09:12 IST)

హైకోర్టుకు చేరిన ఏపీ ఉద్యోగుల పీఆర్సీ పంచాయతీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యమ బాట పట్టిన ఉద్యోగ సంఘాలు ఇకపై ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ పీఆర్సీ పంచాయతీ ఇపుడు హైకోర్టుకు చేరింది. పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన జారీచేసిన జీవో 1ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉద్యోగుల జీతాల్లో కోతపడుతుందని, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 78(1) ఏపీకి వచ్చే ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను స్పష్టం చేస్తోందని, దాని ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, వారికి కల్పించే హెచ్ఆర్ఏ తదితర ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని గుర్తుచేశారు. 
 
అయితే, ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పీఆర్సీ అందుకు విరుద్ధంగా, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేలా ఉందన్నారు. పీఆర్సీ కమిషన్ నివేదికను గానీ, కార్యదర్శకుల కమిటీ నివేదికలో పరిశీలించిన విషయాలను గానీ ప్రభుత్వం బయటపెట్టకుండా పీఆర్సీ జీవో ఇచ్చిందని, సంబంధిత జీవో సహజ న్యాయసూత్రాలు, విభజన చట్టానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో న్యాయస్థానం జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అని పిటిషనర్ కోరారు.