గురువారం, 16 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2025 (16:33 IST)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

narendra modi
ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలాగే, ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ ఉందన్నారు. ఒక రోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా, గురువారం కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 
 
ఇందులో ప్రధాని మోడీ మాట్లాడుతూ, 'సైన్స్‌, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉంది. అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడికి నమస్కరిస్తున్నా. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్‌లో నేను జన్మించాను. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించింది. ఇవాళ శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందాను.
 
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోంది. ఢిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. 2047 నాటికి మన దేశం.. వికసిత్‌ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం' అని ప్రధాని మోడీ అన్నారు.