నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన : జీఎస్టీ పండుగ - రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టులు...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక రోజు పర్యటన నిమిత్తం బుధవారం నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారు చుట్టనున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం రూ.13400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటన శ్రీశైలం, కర్నూలులో జరగనుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదట శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు.
ఆ తర్వాత ప్రధాని పర్యటనలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద నిర్మించ తలపెట్టిన డ్రోన్ సిటీ అత్యంత కీలకం కానుంది. 350 ఎకరాల్లో తొలిదశలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. డ్రోన్ సిటీ ఏర్పాటుతో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఏటా రూ.3,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా మరో 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. దీనితో పాటు విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల రంగాలకు చెందిన పలు ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
అనంతరం కర్నూలులో జరిగే 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను, వాటి ఫలాలను వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ప్రధాని పర్యటన రాష్ట్రంలో సుమారు ఆరున్నర గంటల పాటు కొనసాగనుంది.