బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (05:52 IST)

మంత్రులతో బూతులు మాట్లాడిస్తే పోలవరం పూర్తవదు: దేవినేని ఉమామహేశ్వరరావు

దేశంలోని  16 జాతీయప్రాజెక్టుల్లో ఒక్క పోలవరంలో తప్ప, దేనిలోనూ 10శాతం పనులుకూడా జరగలేదని, ఒక్క పోలవరం ప్రాజెక్టులో మాత్రమే, చంద్రబాబునాయుడి హాయాంలో 71శాతం పనులుజరిగాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్ పరిధిలోని లెఫ్ట్, రైట్ కెనాల్ పనులు, హెడ్ వర్క్స్ పనులు, మెయిన్ డ్యామ్ ప్యాకేజీ, డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్, కాంక్రీట్ వర్క్స్, రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్ కనెక్టివిటీ ప్యాకేజెస్ వంటివన్నీ కలిపి, 71.02శాతం పనులు జరిగినట్లు వైసీపీప్రభుత్వంలోని అధికారులే ముఖ్యమంత్రికి చెప్పారన్నారు.

ఇంత చెప్పినా జలవనరుల మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని, ముఖ్యమంత్రేమో తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదన్నారు. బాధ్యతారాహిత్యంగా, సంస్కారహీనంగా, అవగాహనలేకుండా మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని దేవినేని మండిపడ్డారు. అరమీసం తీసుకుంటా.. మీసం తీసుకుంటా అంటూ బుర్రలేకుండా, విషయం తెలుసుకోకుండా ఏదిపడితే అది మాట్లాడితే ఎలాగన్నారు. 

ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ స్టేటస్ వివరాలు చూస్తే, 26 మే-2019నాటికి 71.13 శాతం పనులు జరిగినట్లు, 71.43 శాతం పనులు 10 జూన్ – 2019నాటికి పూర్తయినట్లు చెప్పారని, అవేపనులు  జూన్ 20-2019 వచ్చేసరికి 66.77శాతం అయినట్లు చెప్పారన్నారు. ఈ సమాచారమంతా అధికారులు ఆన్ లైన్ లో పెట్టారని, దాన్ని పట్టించుకోకుండా, బూతులు మాట్లాడితేనో, బోకరిస్తేనో వాస్తవాలు అవాస్తవాలు కావనే నిజాన్నిబూతులు మాట్లాడే మంత్రి తెలుసుకోవాలన్నారు.

రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తే టీడీపీని మూసేస్తారా అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన మంత్రులు ఇప్పుడేం మూసుకుంటారో చెప్పాలని దేవినేని నిలదీశారు. ఒక్కశాతం అంటూ రివర్స్ టెండరింగ్ లు జరిపినవాళ్లు ఏం ఆదాచేశారో చెప్పాలన్నారు. 2020-21నాటికి పోలవరం పూర్తవుతుందని, కార్యాచరణ ప్రణాళిక సమర్థవంతంగా పూర్తిచేస్తామని చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయో చెప్పాలన్నారు.

డ్యామ్ సైట్ పరిధిలోకి వరదవచ్చి, నిర్వాసితులు నీళ్లలో మునిగితే, మంత్రి అనిల్ కుమార్ గానీ, ముఖ్యమంత్రి గానీ ఆప్రాంతానికి వెళ్లలేదన్నారు. నిర్వాసితులుకు భోజనాలు, మంచినీరు ఇవ్వలేని వారు, 18లక్షల   ఇళ్లు కడతామంటూ బీరాలు పలుకుతున్నారు. సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన పట్టిసీమను కూడా పనికిమాలిన నాయకులు తప్పుపట్టారన్నారు. 

ఇప్పటివరకు పోలవరంప్రాజెక్ట్ నిర్మాణానికి వెచ్చించిన మొత్తం సొమ్ము, రూ.16,673 కోట్లని, జగన్ మఖచిత్రంతో కూడిన సమాచారమే ఆన్ లైన్ లో ఈ విషయం చెబుతోందన్నారు.  2014 తర్వాత రూ.11,537కోట్లు చంద్రబాబు ప్రభుత్వంలో ఖర్చు చేయడం జరిగిందని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, కుడి, ఎడమకాలువల్లో జరిగిన మట్టిపనులెన్ని, తరువాత జరిగిన పనులేమిటో జగన్మోహన్ రెడ్డి, ఉత్తరకుమార మంత్రి  సమాధానం చెప్పాలన్నారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న జగన్మోహన్  రెడ్డి దురాశ కారణంగా, ఫోర్స్ ఫుల్ క్లోజర్ చేయడంతో, ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయన్నారు. జగన్మోహన్ రెడ్డి పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలని చూడటంవల్ల ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కొన్ని పనులు రద్దుచేసి, మళ్లీ టెండర్లు పిలవడంవల్ల, ఐదేళ్ల కాలం వృథా అయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి తన మంత్రులతో బూతులు మాట్లాడిస్తే, ప్రాజెక్ట్ పూర్తవదన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చాక, జరుగుతున్న పనులను రద్దుచేసి, ఒక్కశాతం కూడా పనులు చేయకుండా, రివర్స్ టెండరింగ్ పేరుతో అసమర్థతను, తెలివితక్కువ తనాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారన్నారు.

కేబినెట్ నోట్ అంటే ఏమిటో తెలుసా అన్న ఉమా, 2005-06లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 95వ మీటింగ్లో రూ.10,151కోట్లకు అనుమతులిచ్చిందని, 2010-11లో మరోసారి రూ.16,010కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పూర్తిస్థాయిలో అనుమతులిచ్చిందని, ఆ తరువాత 2019 ఫిబ్రవరిలో రూ.55,548కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు.

తరువాత నాటి జలవనరుశాఖ కేంద్రమంత్రి, పోలవరం ఫైల్ ను ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు పంపడం జరిగిందన్నారు. ఇదంతా తెలిసీ కూడా కేసుల భయంతో, ప్రధానిని ఒప్పించేధైర్యం లేక, ఒక్కరోజు కూడా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఢిల్లీలోఅడిగేధైర్యం లేక ఏదేదో మాట్లాడుతున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్రసహాయమంత్రి కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందన్నారు.

2013-14 ప్రైస్ లెవల్ కు అనుగుణంగా, లాంగ్ టర్మ్ ఫండ్ కింద, నాబార్డ్ రుణంతో ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగేలా ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. దానిప్రకారం ఆనాడు నాబార్డ్ నుంచి చెక్కు కూడా తీసుకున్నార న్నారు. రూ.6,727కోట్ల వరకు టీడీపీప్రభుత్వంలో కేంద్రం నుంచి తీసుకొచ్చామని, రూ.4,810కోట్ల వరకు కేంద్రం రావాల్సి ఉందని, అందులో రూ.1850కోట్లకు చెక్కుతెచ్చిన వైసీపీ ప్రభుత్వం, ఆసొమ్ముని లిక్కర్ కంపెనీలకు చెల్లించిందన్నారు.

రూ.1850కోట్ల చెక్కు తెచ్చుకున్నప్పుడు కూడా వైసీపీప్రభుత్వం రూ.47వేల కోట్లకు ఒప్పుకోవడం జరిగిందన్నారు. భూసేకరణ, పునరావాసం, హెడ్ వర్క్స్, విద్యుత్ కేంద్రం, కుడి - ఎడమప్రధాన కాలువలు సహా, అన్నిపనులకురూ.55,548కోట్లకు ఆమోదం తెలిపితే, ఇవేవీ తెలియవన్నట్లు వైసీపీప్రభుత్వం వ్యవహరిస్తోం దన్నారు. 

అధికారులు చెప్పేది వినకుండా, ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా లేనిదాన్ని ఉన్నట్లుగా మాట్లాడుతూ, రాష్ట్రప్రయోజనాలకు విఘాతం కలిగేలా వైసీపీవారు వ్యవహరిస్తున్నారన్నారు. ఈవీఎంల పుణ్యమా అని, ఒక్కసారి ఒక్కసారి అంటూ పీఠమెక్కి, పనికిమాలిన మంత్రులతో ఏదేదో మాట్లాడిస్తున్నారన్నారు. మంత్రిబొత్స పోలవరం గురించి మాట్లాడుతున్నాడని, ఆయనకు తోటపల్లి రిజర్వాయర్ గురించి కూడా తెలియదన్నారు.

వైసీపీప్రభుత్వానికి చేతనైతే, చేవ ఉంటే, ఈ 17నెలల్లో పోలవరంలో ఏ ఉద్దరించారో చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. హెడ్ వర్క్స్ పనుల్లో రూ.9,734కోట్లు, కెనాల్ వర్క్స్ లో రూ.9,180కోట్లు, ఆర్ అండ్ ఆర్ లో రూ.32,509కోట్ల వరకు ఉంటే, అవన్నీ దెబ్బతీసేలా, నిర్వాసితులకు అన్యాయం చేసేలా వైసీపీనేతలు మాట్లాడుతున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నిప్రాజెక్టుల్లో ఎంతెంత పనులు చేశారో చెప్పాలన్నారు.

ఈ ప్రభుత్వం కేవలం 6ప్రాజెక్టులను మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, వాటిలో కూడా రూ.వెయ్యికోట్ల వరకు మాత్రమే పనులుచేశారన్నారు. వంశధార- నాగావళి, పెన్నా-గోదావరి, వెలిగొండ టన్నెల్, పనులు ఎంతవరకు చేశారో చెప్పాలన్నారు. గండికోటలో 24 టీఎంసీల వరకు నిల్వచేయలేక పోయారన్నారు. నెల్లూరులో సంగం బ్యారేజీ పనులు ఎంతవరకు చేశారో అనిల్ కుమార్ చెప్పాలన్నారు.

అరేయ్.. ఒరేయ్ అంటూ మంత్రులతో బూతులు మాట్లాడిస్తే, ప్రాజెక్టు పనులు పూర్తవవని జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే మంచిదన్నారు. వైసీపీప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్ రంగానికి ఎంతఖర్చుచేశారో, ఎన్నిలక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీశారో ముఖ్యమంత్రి, మంత్రి అనిల్ కుమార్ సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

తెలంగాణకు బస్సులు నడపలేని ముఖ్యమంత్రి , రాష్ట్రాన్ని ఏం నడుపుతాడని, పోలవరాన్ని ఏవిధంగా పూర్తిచేస్తాడని ప్రజలంతా అనుకుంటన్నా రన్నారు. ముఖ్యమంత్రి మీడియా ముందుకు రావడానికి ఎందుకు ముఖం చాటేస్తున్నాడో, రైతుల ముందుకు వెళ్లకుండా గాల్లో ఎందుకు తిరుగుతున్నాడో చెప్పాలన్నారు.

ఏప్రాజెక్ట్ పూర్తిచేస్తో ఏప్రాంతానికి నీళ్లు వెళతాయో కూడా ఈప్రభుత్వానికి తెలియదన్నారు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లు వెళ్లకూడదనే ముఖ్యమంత్రి హంద్రీనీవా పనులు ఆపేయించాడన్నారు. చంద్రబాబుమాత్రం పులివెందులకు కూడా నీళ్లిచ్చి, రైతులకు అండగా నిలిచారన్నారు. అధికారం ఉందనే అహంకారంతో దుర్మార్గాలకు పాల్పడకుండా, పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించాలన్నారు.

నిర్వాసితుల గురించి పట్టించుకున్నారా అని చంద్రబాబుప్రభుత్వాన్ని ప్రశ్నించేముందు 135 అడుగుల ఎత్తులో నీరునిల్వచేయడంకోసం, ల్యాండ్ అక్విజేషన్ కు టీడీపీప్రభుత్వంలో రూ.5,398కోట్లు, ఆర్ అండ్ ఆర్ కి రూ. 802కోట్లు కలిపి మొత్తం రూ.6,200కోట్ల వరకు ఖర్చచేసిన విషయాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు.

రాజశేఖర్ రెడ్డి హాయాంలో, కిరణ్ కుమార్ రెడ్డిప్రభుత్వంలో, ఎంత ఖర్చుచేశారో, జగన్ వచ్చాక దేనికెంత ఖర్చుచేశాడో ఆయనే సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిల్వచేయాలంటే, పోలవరానికి ఇంకా రూ.27,025కోట్ల వరకు ఖర్చుచేయాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలన్నీ పోలవరం డ్యామ్ సైట్ తోపాటు, ఆర్ అండ్ అర్ వెబ్ సైట్ లోఉన్నాయన్నారు.

రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో నిర్వాసితులకు డబ్బులు  అందకపోవడంతో, రిహాబిలిటేషన్ కింద చంద్రబాబు ప్రభుత్వం  మరోసారి రూ.110కోట్ల వరకు చెల్లించడం జరిగిందన్నారు. 141 వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని రూ.55,548కోట్లకు ఆమోదం తెలిపితే, ఈచిల్లర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ, వాస్తవాలను మరుగున పడేసి, పిచ్చికూతలు కూస్తోందన్నారు.

సాక్షిలో రాసే తప్పుడు రాతలు, పిచ్చి కూతలతో రాష్ట్రప్రయోజనాలు దెబ్బతీయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడని, ఆయన ఇప్పటికైనా పోలవరంపై నోరు తెరవాలని దేవినేని డిమాండ్ చేశారు.  ముఖ్యమంత్రి దేనికి భయపడుతున్నా డో, చెప్పాలన్నారు. పోలవరంలో తన దుర్మార్గాలు, తన దోపిడీ బయట పడతాయన్న భయంతో ఆయన ఉన్నాడా అని దేవినేని నిలదీశారు.

జగన్ గతంలో పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలని చూడబట్టే, ప్రాజెక్టుపై రూ.10వేలకోట్ల వరకు భారం పడిందన్నారు. రాష్ట్రానికి మేలు చేసే బహుళార్థసాథక ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో జగన్ మౌనం, రాష్ట్రానికే చేటుగా మారిందని దేవినేని స్పష్టంచేశారు. పోలవరంతో ఆటలొద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.