శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (08:58 IST)

బోయినపల్లి కిడ్నాప్‌ కేసు_ బెంగళూరులో అఖిలప్రియ భర్త భార్గవరామ్‌..?

బెంగళూరులో అఖిలప్రియ భర్త భార్గవరామ్‌..?

బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో నిందితుడైన ఎపి మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ బెంగళూరులో ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. అతని కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీప బంధువులైన ముగ్గురిని కిడ్నాప్‌ చేయించడం కోసం గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందిన 15 మందిని భార్గవరామ్‌ రప్పించాడని పోలీసులు తెలిపారు. 
 
కిడ్నాప్‌కు పాల్పడిన దుండగులు టోల్‌ప్లాజాలవైపు వెళితే దొరికిపోతామన్న ఉద్దేశంతో అవి లేని సర్వీస్‌ రోడ్ల మీదుగా బెంగళూరు వైపు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాప్‌ కు పథకం రచించిన భార్గవ్‌రామ్‌కు నేర చరిత్ర ఉందని, పలు ఆర్థిక నేరాల్లో ఆయన పాత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
 
ఇకపోతే.. మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు బుధవారం రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించారు. రిమాండ్ అనంతరం అఖిలప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశారు. గురువారం బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరగనున్నాయి. అఖిలప్రియను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ అఖిలప్రియ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
 
A1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణ అనంతరం 41 సీఆర్పీ నోటీసు ఇచ్చి వదిలేశారు. కానీ A2గా ఉన్న అఖిలప్రియను మాత్రం అరెస్ట్ చేశారని కుటుంబసభ్యులు వాదిస్తున్నారు. అంతేకాకుండా కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.