శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (08:27 IST)

కొట్టుకునేంత సీన్ ఎవరికీ లేదు.. మాట్లాడుకుందాం రండి: భూమా మౌనిక

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తన అక్క, మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిలప్రియా రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెకు కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధించడంతో చెంచల్‌గూడ జైలుకు తరలించారు. పైగా, అఖిలప్రియ ప్రస్తుతం గర్భంతో ఉంది. దీంతో ఆమె ఆరోగ్యంపై చెల్లెలు భూమా మౌనిక స్పందించారు. 
 
తన అక్క విషయంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు. అక్క అరెస్టు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చని.. ఆమె ఎప్పుడూ ఎవర్నీ డబ్బులు డిమాండ్‌ చేయలేదన్నారు. కనీస సమాచారం లేకుండా 30, 40 మంది మగ పోలీసులు ఇంటికొచ్చారని తెలిపారు. 
 
మహిళా పోలీసులు లేకుండా ఏవిధంగా వస్తారని ప్రశ్నించారు. మూడు నెలలుగా అక్క ఆరోగ్యం చాలా సెన్సిటివ్‌గా ఉందని, అప్పుడప్పుడు ఫిట్స్‌ వస్తుంటాయని తెలిపారు. రిమాండ్‌ రిపోర్టులో ఉన్నది కరెక్ట్‌ కాదని, హైదరాబాద్‌లో తమకు భద్రత లేదని అన్నారు. 
 
గాంధీ ఆస్పత్రిలో అక్క కళ్లు తిరిగి పడిపోయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ఫిట్‌గా ఉందని, తీసుకెళ్లండని పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారని తెలిపారు. అఖిలప్రియ విషయంలో ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 
 
నిజానికి మా నాన్న అకస్మాత్తుగా చనిపోవడంతో ఏ ఆస్తులు ఎక్కడున్నాయో మాకు తెలియదు. మా నాన్నకు చాలామంది వ్యాపార భాగస్వాములు ఉన్నారు. మా వాటాలకు సంబంధించి గతంలో మేం వాళ్లతో మాట్లాడాం. అక్క కోసం, తమ్ముడి కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. 
 
కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. కొట్టుకునేంత సీన్‌ ఇప్పుడు ఎవరికీ లేదు. ఎవరైనా పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహిస్తే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పుకొచ్చారు. పైగా, అక్క భర్త అయిన మా బావ భార్గవ్‌ రామ్‌ ఎక్కడున్నారో తమకు తెలియదన్నారు.