1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 20 ఆగస్టు 2021 (14:17 IST)

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్ల విడుదల వాయిదా? ఎందుకో తెలుసా..?

పరిమిత సంఖ్యలోనే ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్సనార్థం టిటిడి టోకెన్లను భక్తులకు అందిస్తోంది. అది కూడా ఆన్లైన్ ద్వారానే టోకెన్లను అందిస్తూ వస్తోంది. ఆఫ్ లైన్ ద్వారా అంటే కౌంటర్ల ద్వారా ఎక్కడా టోకెన్లను ఇవ్వడం లేదు. విఐపిలైతే నేరుగా తిరుమలకు వెళ్ళి జెఈఓ కార్యాలయంలో టోకెన్లను పొందాల్సి ఉంటుంది.
 
గత కొన్ని నెలలుగా కరోనా కారణంగా టోకెన్లను ఆన్ లైన్లో పరిమిత సంఖ్యలో అందిస్తోన్న టిటిడి ఇప్పుడు ఉన్నట్లుండి టోకెన్లను వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకుంది. అది కూడా సెప్టెంబరు నెలకు విడుదల చేయాల్సిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్లను వాయిదా వేసింది.
 
ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రవేశ దర్సనా టిక్కెట్లను టిటిడి ఆన్ లైన్లో విడుదల చేస్తూ వస్తోంది. సెప్టెంబర్ నెల దర్సన టిక్కెట్ల విడుదల తేదీని త్వరలో తెలియజేస్తామని ఇప్పటికే టిటిడి ఒక ప్రకటన విడుదల చేసింది.
 
అయితే టిటిడి ఈ ప్రకటన విడుదల చేయడానికి ఒక కారణం కూడా ఉందట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని బాగా తగ్గించడం.. ఎక్కడా పెద్దగా ఆంక్షలు లేకపోవడం.. కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టడంతో భక్తులకు టోకెన్ల సంఖ్యను పెంచాలన్న ఆలోచనలో కూడా టిటిడి ఉందట.
 
ఈ పదిరోజుల పాటు ఆలోచించి.. కేసుల సంఖ్య పెరుగుతుందా లేదా చూసుకుని ఆ తరువాత టోకెన్లను ఆన్ లైన్లో పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారట. అందుకే ప్రస్తుతానికి టోకెన్ల విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.