1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 20 జనవరి 2022 (15:13 IST)

జీవోలు అడ్డ‌గోలుగా ఇవ్వ‌లే... ఉద్యోగుల సంఘాల‌తో చ‌ర్చించాకే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉద్యోగ సంఘాలతో అన్ని చర్చించిన తర్వాతే పీఆర్సీ ప్రకటించడం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల సమ్మెకు వెళ్ళటం సరి కాదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేశారు. 
 
 
మంత్రి బొత్స స‌త్య‌న్నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ, మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగస్తులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత, చర్చించి క్యాబినెట్‌లో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగస్తులకు జీవోలు ఏకపక్షంగా అడ్డగోలుగా ఇవ్వలేదని, ఉద్యోగ సంఘాలతో  చర్చించిన తర్వాతే జీవోలు విడుదల చేశామని చెప్పారు.


జీవోలు ఇచ్చి తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారని, వాటన్నిటినీ పరిశీలించి వాటిపై ఆలోచిస్తామన్నారు. ఉద్యోగులు నోటీసులు ఇచ్చి దాని మీద చర్చించడం వారి హక్కు, కానీ సమ్మెకు వెళ్లడం సరైన విధానం కాదని మంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు.