1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:54 IST)

బ్రేకింగ్ న్యూస్: ఏపీలో కరోనా మహమ్మారితో గర్భిణీ మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి గర్భిణీ మహిళను కాటేసింది. కరోనా వైరస్ కారణంగా ఏపీలో గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఏపీలో రోజురోజుకూ వైరస్ ప్రభావం తీవ్రమవుతోంది. తాజాగా.. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చాగల్లులో గర్భిణి మృతి చెందింది. 
 
గత కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైన ఆమెను వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నేపథ్యంలో వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో ఒక్కసారిగా వైద్యవర్గాలు ఆందోళనకు గురయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమె గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో ప్రధానంగా గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
 
మరోవైపు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా నివసిస్తూ నరసరావుపేటలో పనిచేస్తున్న వైద్యురాలికి పాజిటివ్ అని తేలడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఆమె కుటుంబ సభ్యులకు మాత్రం నెగటివ్ రిపోర్టులు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
 
మరోవైపు, జిల్లాలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నేడు కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 177కు పెరిగినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.