1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (11:41 IST)

ఎస్పీకి కాదు.. వాడి అమ్మ మొగుడికి చెప్పుకో.. ఏం పీకుతారు... : వైకాపా ఎమ్మెల్యే హల్చల్..

ysrcp flag
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దీంతో ఆయన ప్రభుత్వ అధికారిపై బూతు పురాణం అందుకున్నారు. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్.ఈ.బి) ఎస్ఐ అలీ బేగ్‌పై తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో దూషించారు. 
 
ఎస్పీకి కాదు.. వాడి అమ్మ మొగుడికి కూడా చెప్పుకోపో.. ఏం పీకుతారంటూ మండిపడ్డారు. ఇంతకీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంతగా రెచ్చిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తే, ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకుని వెళ్తుండగా ఎస్ఈబీ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని నిర్ణయించి, సంతకం పెట్టాలని పుల్లయ్యను కోరగా నిరాకరించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాన్రెడ్డి తన అనుచరులతో ఎస్ఈబీ స్టేషన్‌కు వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
నిబంధనల ప్రకారం ఒక్కో వ్యక్తి వద్ద మూడు మద్యం సీసాల కంటే ఎక్కువ ఉండకూడదని ఎస్ఐ అలీ బేగ్.. ఎమ్మెల్యే రాచమల్లుకు వివరించారు. 
 
ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఇద్దరు ముగ్గురికి చెందిన మద్యం సీసాలను ఒక వ్యక్తి తీసుకెళ్తే నేరమా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. 'కుటుంబంలో వ్యక్తి చనిపోతే కర్మకాండలు చేసుకుంటూ మద్యం తీసుకెళ్తుంటే పట్టుకుంటారా? పేదలను పట్టుకుని పీడిస్తారా' అంటూ ప్రశ్నించారు. తాము ఎవరినీ బాధపెట్టలేదని ఎస్.ఐ. చెప్పగా.. అసలు కేసు రాస్తే ఒప్పుకోనని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్ఐ ఎంతకీ వినకపోవడంతో ఎమ్మెల్యేకు అగ్రహం వచ్చింది. 
 
ఎస్ఈబీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి కుర్చీల్లో కూర్చొని.. ఎస్ఐని నిలబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. 'మద్యం కేసులు నమోదు చేస్తే.. రోజూ స్టేషన్‌కు వస్తా... ఎస్పీకి కాదు.. వాళ్ల బాబుకి చెప్పుకో.. భయపడను. మీ చట్టాన్ని మార్చుకుంటావో.. లేదా ప్రభుత్వాన్ని మార్చుకుంటావో తేల్చుకో. కేసులు మాత్రం పెట్టడానికి వీల్లేదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఎమ్మెల్యే ఎస్ఈ స్టేషన్‌లోనే మీడియాతో మాట్లాడారు. డబ్బు సంపాదనకు అధికారులు అక్రమ మార్గాలు ఎంచుకున్నారని ఆరోపించారు. నెల మామూళ్లు తీసుకుంటూ.. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం వస్తున్నా పట్టుకోవడం లేదన్నారు. 
 
ప్రభుత్వ దుకాణాల్లోని మద్యం ప్రైవేటు బార్లకు వెళ్లిందని తెలిపారు. ప్రైవేటు బార్లకు నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇస్తున్నారని, అక్కడ ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతోందన్నారు.