రూ.1000 కోట్లను వెనకేసుకున్న పెద్దబాస్, చిన్నబాస్ ఎవరు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో భారీ కోల్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. గుజరాత్కు చెందిన పారిశ్రామికవేత్త ఆదానీకి భారీ కాంట్రాక్టును కొనసాగించడం ద్వారా సర్కారీ ఖజానాకు పెద్ద ఎత్తున గండి పడిందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఆదానీ గ్రూపు నుంచి పెద్దబాస్, చిన్నబాస్లు రూ.1,000 కోట్లు వెనకేసుకున్నారని విమర్శలు గుప్పించారు.
ఈ విషయంపై నిజాలను నిగ్గు తేల్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు అఖిలపక్షాన్ని వేసి తన నిజాయతీని నిరూపించుకోవాలని రఘువీరా డిమాండ్ చేశారు. అయితే పెద్దబాస్, చిన్నబాస్లు ఎవరన్న విషయాన్ని మాత్రం రఘువీరా తెలియజేయలేదు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీల మధ్య ఎడతెగని వివాదంలా మారిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లనుంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ను కలవనున్న టీ టీడీపీ నేతలు, తెలంగాణలో అధికార పార్టీ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతితో భేటీకి టీటీడీపీ నేతలకు ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా లభించింది.
తమ పార్టీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లో చేరడంతో పాటు మంత్రి పదవి కూడా చేపట్టడం చట్టవిరుద్ధమని టీటీడీపీ నేతలు వాదిస్తున్నారు.