1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (08:15 IST)

తెలంగాణాలో విస్తారంగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తారుగా వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ప్రారంభమైంది. నైరుతి రుతపవనాలు దేశ వ్యాప్తంగా ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మంగళ, బుధవారాల్లోకూడా తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం రాత్రి తీరం దాటి ఝార్ఖండ్‌పైకి చేరుకుంది. ఇదిప్పుడు తెలంగాణ వైపునకు తిరిగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతోపాటు ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
ఇదిలావుంటే, అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. 
 
దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉంది. ఇది పడమర దిశగా ప్రయాణించొచ్చు. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని అధికారులు చెప్పారు.