శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (10:31 IST)

ఏపీలో ఇక వీధి వీధికీ రేషన్‌ వాహనం

రేషన్‌ వాహనం ఇక నుంచి వీధి వీధికీ తిరగాల్సిందే. ఇంటింటికీ రేషన్‌ ఇవ్వాల్సిందే. రేషన్‌ పంపిణీ పూర్తయ్యేవరకూ ప్రతిరోజూ వాహనం పనితీరును జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.

ప్రతి వాహనానికి జీపీఎ్‌సను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆ శాఖ ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగు వారాల్లో అన్ని వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు చేసి, మే నుంచి పర్యవేక్షణ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. జీపీఎ్‌సను వాహనాల డ్రైవర్లు ఆపేందుకు వీల్లేకుండా నేరుగా వాహనం బ్యాటరీకి అనుసంధానం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

దానిని అనుసరించి ప్రతిరోజూ వాహనం ఎప్పుడు ప్రారంభమైంది... ఏయే వీధులు తిరిగింది... ఎక్కడ ఎంతసేపు ఆగింది... సాయంత్రం తిరిగి సచివాలయానికి ఎప్పుడు వచ్చింది... ఇలా మొత్తం వివరాలను జీపీఎస్‌ విధానం రికార్డు చేస్తుంది.
 
ప్రతి వాహనానికి పంపిణీ చేయాల్సిన గ్రామాలు, ప్రాంతం ఇప్పటికే మ్యాపింగ్‌ చేసి ఉన్నాయి. దీంతో ఆ వాహనం ఏ వీధులు తిరగాలనే దానిపై ఇప్పటికే స్పష్టత ఉంది. నెలలో ఆ వీధికి వాహనం వెళ్లిందా? లేదా? అనే విషయం మ్యాప్‌ చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఎక్కడైనా వాహనం ఇంజిన్‌ ఆపేసినా వెంటనే జీపీఎ్‌సలో రికార్డు అవుతుంది.

ఈ వ్యవస్థను పర్యవేక్షించేందుకు తహసీల్దారు, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల గోడౌన్‌ ఎండీ, రాష్ట్ర స్థాయిలో కమిషనర్‌ కార్యాలయ అధికారులకు లాగిన్‌ అయ్యే సదుపాయం ఉంటుంది. వీరిలో ఏ అధికారి అయినా ఎప్పుడైనా లాగిన్‌ అయి ఫలానా వాహనం ఎక్కడుందనే విషయాన్ని చూడొచ్చు.

దీని ఆధారంగా ఏవైనా వాహనాలు పంపిణీ ప్రారంభించకపోయినా, ఎక్కడైనా ఆపేసినా వెంటనే సంబంధిత డ్రైవర్లకు ఫోన్లు చేసి హెచ్చరించే అవకాశముంది.