ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్, త్రీ ఛీర్స్ : ఆర్జీవీ ట్వీట్...
గత వైకాపా ప్రభుత్వంలో నాటి విపక్ష నేతలుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్లను, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియలో షేర్ చేసినందుకు వివాదాస్పద తెలుగు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ఆయన కోర్టులో మధ్యంతర బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలనుసారం ఆర్జీవీ తాజాగా ఒంగోలు పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆ తర్వాత కేవలం గంటన్నర వ్యవధిలోనే ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేశారు. దీనిపై వ్యంగ్యంగా అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు.
ఐ లవ్ ఒంగోల్.. అండ్ ఐ లవ్ ఒంగోల్ పోలీసు ఈవెన్ మోర్, త్రీ ఛీర్స్ అంటూ తన ఎక్స్ వేదికలో పోస్ట్ చేశారు. ఇపుడు దీనిపై విపరీతమైన చర్చ సాగుంతుంది. ఒంగోలు పోలీసులను ఆయన ప్రశంసించారా లేదా గంటల తరబడి ప్రశ్నించినా తనను ఏమీ చేయలేకపోయారనేలా అర్థం వచ్చేలా ఈ ట్వీట్ చేశారన్న చర్చ మొదలైంది.
కాగా, విచారణ సమయంలో మొబైల్ ఫోనును తమకు అప్పగించాలని పోలీసులు వర్మను కోరగా, అది తన మేనల్లుడి వద్ద కారులో ఉందని, అతడు హైదరాబాద్ వెళ్లిపోయాడని పోలీసులకు వర్మ బదులిచ్చారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు వర్మ ఫోన్ లొకేషన్ను చెక్ చేయగా అది వైసీపీ జిల్లా కార్యాలయంలో ఉన్నట్టు చూపించింది.
దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఫోన్ కోసం ఆరా తీశారు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వర్మ ఫోన్ ఇక్కడ ఎందుకు ఉంటుందని చెప్పడంతో చేసేది లేక వారు వెనుదిరిగారు.