1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (14:25 IST)

విశ్రాంతి తీసుకున్న డ్యూటీ డాక్టర్ .. రోగికి చికిత్స చేసిన స్వీపర్లు

security staff treatment
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ దారుణం జరిగింది. రోగులకు చికిత్స చేయాల్సిన వైద్యుడు తాపీగా విశ్రాంతి తీసుకుంటే.. ఆస్పత్రిని శుభ్రం చేయాల్సిన స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, అటెండర్లు రోగికి వైద్యం చేశారు. తగిలిన గాయానికి ఏకంగా కుట్లు కూడా వేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని అనంతసాగరంకు చెందిన రామకృష్ణ అనే లెక్చరర్ బైకుపై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడు.. క్షతగాత్రునికి ఒక ఇంజెక్షన్ వేసి ఆ తర్వాత తన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నరు. 
 
విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ వైద్యం చేయలేదు కదా.. క్షతగాత్రుడిని తాకను కూడా తాకలేదు. కట్టు కట్టడం దగ్గర నుంచి సెలైన్ బాటిల్ పెట్టేవరకు అంతా సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, కాంపౌడర్లే చేశారు. వాళ్లు రామకృష్ణకు తలకు కట్టిన కట్టు కూడా ఎంతో సేపు నిలవలేదు. 
 
ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం చేయకపోవడంతో రామకృష్ణ ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో ఆయన్ను హుటాహుటిన నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.