శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

రోడ్డు భద్రత మనందరి కర్తవ్యం : ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి!

రోడ్డు భద్రత మనందరి కర్తవ్యమని ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేసమయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతయినా ఉందని ట్రాఫిక్ ఎడిసిపి టి.సర్కార్ అన్నారు. బెంజిసర్కిల్ వద్ద గల లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ నందు 32 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా శనివారం సెమినార్ జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వాహనాలు సక్రమంగా నడపకపోవడం సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. అలాగే వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలన్నారు. 
 
ముఖ్యంగా యువత బైక్స్ పై స్పీడ్‌‌గా వెళుతుంటారని అది ప్రమాదానికి సంకేతమని కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నిర్ణీయ వేగంతోనే వెళ్లాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని కోరారు. అలాగే వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. 
 
ప్రజలకు వాహన ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రతి ఏటా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నారని నెల అంతా రోడ్డు భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియచేస్తామన్నారు. ట్రాఫిక్ ఎసిపి జె.వెంకట నారాయణ మాట్లాడుతూ మితిమీరిన వేగంతో ఎవరూ వెళ్లవద్దని కోరారు. ఈ కార్యక్రంలో ట్రాఫిక్ సిఐలు మురళీ రామకృష్ణ, రవికుమార్, ఎస్ఏలు, పలువురు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.