1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (15:31 IST)

చిత్తూరుకు ఆ ఇద్దరు సీఎంలు ఏం చేశారు.. కిరణ్, బాబులపై రోజా ఫైర్

చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాకు ఏమీ చేయలేదంటూ..  వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ప్రారంభించిన అమ్మ ఒడి కార్యక్రమంలో పాల్గొన్న రోజా విపక్షాలపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లా అని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా గతంలో సీఎంలుగా బాధ్యతలు నిర్వర్తించిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు వ్యవహరించారని రోజా విమర్శించారు. 
 
అయితే సీఎం జగన్ చిత్తూరు జిల్లాకు ఎంతో చేస్తున్నారని కితాబిచ్చారు. అ అంటే అమ్మ ఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా సీఎం జగన్ పాలన సాగుతోందని రోజా కొనియాడారు. చంద్రబాబు తాను చదివిన సొంత పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేకపోయారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేశా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరుకు చేసింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు. 
 
ప్రభుత్వ పాఠశాలలను మూసేసి... విద్యను కార్పొరేట్ పరం చేయాలని చూసిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని... పేద విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియం చదువుకుని బాగుపడాలని ఆలోచించిన చరిత్రకారుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని రోజా కొనియాడారు. మధ్యాహ్న భోజనంలో పేదలకు పౌష్టికాహారం అందించిన చరిత్రకారుడు జగన్‌ అయితే.. ఆ పేదపిల్లలు తినే కోడిగుడ్లను కూడా మింగేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని ఆమె ఎద్దేవా చేశారు.
 
కాగా రోజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నిజమే కదా ప్రభుత్వ విద్యావ్యవస్థను ధ్వంసం చేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాసిన చంద్రబాబు నిజంగా చరిత్రహీనుడే అంటూ… నెట్‌జన్లు రోజా వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు.